రూ.100కోట్ల మోడీ బంగ్లాను డైనమేట్లు పెట్టి పేల్చేస్తున్నారు

ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీకి చెందిన బంగ్లాను డైనమేట్ పెట్టి కూల్చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. పునాది పటిష్ఠంగా ఉండటంతో దీన్ని కూల్చేందుకు అధికారులు చాలా కష్టపడుతున్నారు. అలీబాగ్ ప్రాంతంలో సుమారు 33,000చదరపు అడుగుల స్థలంలో విలాసవంతంగా ఈ భవనాన్ని నిర్మించుకోగా.. ఈ భవనాన్ని నేలమట్టం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అక్రమంగా, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో ఈ భవనాన్ని కూల్చేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తుంది. కాగా ఈ భవనం ఖరీదు రూ.100కోట్లు పైమాటే. ఈ బంగ్లాను కూల్చేయడానికి గత ఆరు వారాలుగా పెద్ద పెద్ద యంత్రాలు తెచ్చి అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. పనులు వేగంగా జరగట్లేదు. ప్రహరీ, మెయిన్ గేట్లను మాత్రమే తొలగించగలిగారు. దీంతో డైనమేట్లను ఉపయోగించి భవనాన్ని కూల్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై రాయ్గఢ్ అదనపు కలెక్టర్ భరత్ షితోలే మాట్లాడుతూ.. భవనాన్ని డైనమేట్ పెట్టి కూల్చేసేందుకు ఇప్పటికే రంధ్రాలు పెట్టామని, వాటిల్లో డైనమైట్ను అమర్చి పేల్చివేయమంటూ తమకు ఆదేశాలు అందాయంటూ వెల్లడించారు. రిమోట్ కంట్రోల్ సాయంతో దీన్ని ఆపరేట్ చేస్తామని, దీని వల్ల ఎటువంటి నష్టం కలగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ భవన నిర్మాణానికి అత్యంత నాణ్యమైన లోహాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ బంగ్లాలో ఒక స్విమ్మింగ్ పూల్, రిసార్టు ఉన్నాయి.
ముంబైకి 90కి.మీదూరంలో కిహీమ్ బీచ్ సమీపంలో బంగ్లా ఉండగా.. అక్రమంగా దీనిని నిర్మించారు. బీచ్ సమీపాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేయాలన్న బాంబే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దీనిని పడగొడుతున్నారు.