Warning Labels: ఇక సమోసా, జిలేబీ, పకోడీలపైనా.. సిగరెట్ తరహా వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం కీలక నిర్ణయం

సిగరెట్ ప్యాకెట్స్‌పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.

Warning Labels: ఇక సమోసా, జిలేబీ, పకోడీలపైనా.. సిగరెట్ తరహా వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం కీలక నిర్ణయం

Updated On : July 14, 2025 / 8:12 PM IST

Warning Labels: వర్షాకాలంలో వేడి వేడి టీతో పాటు సమోసా, జలేబీ, చోలే భటురే లేదా పకోడీలను తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. ఈ వేయించిన స్నాక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని తిన్నా అలా కడుపులోకి పోతూనే ఉంటాయి. అయితే, రుచి సంగతి పక్కన పెడితే.. అవి నిశ్శబ్దంగా మన ఆరోగ్యానికి చేస్తున్న హాని అంతా ఇంతా కాదంటున్నారు డాక్టర్లు. జనాలను ఇలానే వదిలేస్తే.. భారీ ఉపద్రవం తప్పదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మనకెంతో ఇష్టమైన సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి సాంప్రదాయక ఆహారాలకూ సిగరెట్ల మాదిరిగానే ఆరోగ్య హెచ్చరికలు జత చేసే రోజు ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది.

అవును.. ధూమపానమే కాదు.. ఇవి కూడా ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు డాక్టర్లు. అందుకే, ఇన్నాళ్లూ సిగరెట్లపై కనిపించిన ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలు.. ఇకపై సమోసా, జిలేబీ, పకోడీ, ఛాయ్ బిస్కెట్ వంటి స్నాక్స్ కి కూడా చూస్తాం.

మ్యాటర్ ఏంటంటే.. అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హానికారక కొవ్వులు అధికంగా ఉండే సమోసా, జిలేబీ, పకోడీ వంటి ఆహారాలకూ సిగరెట్ ప్యాకెట్‌ తరహా హెచ్చరికలు జత చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఆహారాల స్టాల్స్ పక్కన హెచ్చరిక బోర్డులు, పోస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.

షుగర్, డీప్ ఫ్రై ఫుడ్ తో దేశంలో 2050 నాటికి 44 కోట్ల మంది ఒబెసిటీ బారిన పడతారని కేంద్రం అంచనా. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాగ్‌పూర్‌ ఎయిమ్స్ తో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను.. కేఫ్ టేరియాలు, ఫుడ్ కోర్టుల్లో అవగాహన కల్పించేలా “ఆయిల్ అండ్ షుగర్” బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది. తినే స్నాక్స్‌లో కొవ్వు, నూనె, చక్కెర, ఉప్పు శాతం ఎంత ఉంది? అనే వివరాలతో పాటు ఆరోగ్యంపై అవి చూపే ప్రభావాలను తెలిపేలా ఈ బోర్డులు ఉంటాయి.

మొదట పైలట్ గా నాగ్‌పూర్ ఎయిమ్స్‌‌తో పాటు ఇతర ప్రముఖ ఫుడ్ స్టాల్స్ పక్కన ఈ హెచ్చరిక పోస్టర్లు, బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఆ స్నాక్స్ లో చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్‌ ల వివరాలను ఆ పోస్టర్లలో పేర్కొంటారు. తరచూ ఈ ఫుడ్స్ తింటే కలిగే అనారోగ్యాల వివరాలను ప్రస్తావిస్తారు. సిగరెట్ ప్యాకెట్స్‌పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.

Also Read: నిజంగా వైట్ రైస్ తింటే లావవుతారా? అన్నం పూర్తిగా మానేయాలా.. మరి ఎం తింటే మంచిది

అయితే, ఈ చర్య ఆ ఆహార పదార్థాల్లో దాగున్న కేలరీలపై అవగాహన పెంచడం కోసమే తప్ప వాటిని నిషేధించడం కాదని కేంద్రం స్పష్టం చేసింది. సమోసాలు, జిలేబీలు వంటివి ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయంది. తాము ఏ రకమైన ఆహారం తింటున్నది ప్రజలకు తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఉంటాయని వివరణ ఇచ్చింది. ఈ ఆహారాలను పరిమిత స్థాయిలో తినాలన్న అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ పోస్టర్లు రిమైండర్‌లుగా పని చేస్తాయని, ముఖ్యంగా ఇటువంటి వస్తువులను తరచుగా వినియోగించే ప్రదేశాల్లో ప్రజలు మెరుగైన ఆహార ఎంపికలు చేసుకోవడంలో సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.

ఎందుకీ వార్నింగ్ లేబుల్స్..?
భారత్ ఊబకాయం అనే సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో వార్నింగ్ లేబుల్స్ చాలా అవసరమైన దశ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 2050 నాటికి 44.9 కోట్లకు పైగా భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడతారని అంచనా. అమెరికా తర్వాత రెండవ అత్యంత ప్రభావిత దేశంగా భారత్ మారుతుంది.

”ఊబకాయం, డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బుల కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. బాగా వేయించిన ఆహార పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఓ నివేదిక ప్రకారం 2050 నాటికి భారత్‌లో అధిక బరువు, ఊబకాయం వ్యాధిగ్రస్తుల సంఖ్య 44 కోట్లకు చేరుకుంటుంది. ఈ క్రమంలో హానికారక ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం ఉపక్రమించింది” అని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 5 మంది పట్టణ వయోజనుల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, తక్కువ శారీరక శ్రమ కారణంగా బాల్యంలో ఊబకాయం పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ”వార్నింగ్ లేబుల్స్ అంటే.. ఇది ఆహారాన్ని నిషేధించడం గురించి కాదు” అని సీనియర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సునీల్ గుప్తా అన్నారు. “కానీ ఒక గులాబ్ జామున్‌లో ఐదు టీస్పూన్ల చక్కెర ఉంటుందని ప్రజలకు తెలిస్తే, వారు మరొకటి తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు. ఫుడ్ కౌంటర్లు, క్యాంటీన్లు, స్నాక్స్ అందించే ఇతర ప్రాంతాల దగ్గర త్వరలో ఈ పోస్టర్లు ప్రదర్శించబడతాయి. ఈ “నూనె -చక్కెర బోర్డులు”.. సమోసాలు, వడ పావ్, జిలేబీలు, బిస్కెట్లు, లడ్డూలు వంటి ప్రసిద్ధ ఆహారాల్లో ఉండే కేలరీలు, చక్కెర, కొవ్వు పదార్థాలను చూపుతాయి” అని ఆయన వివరించారు.