జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ పై మోడీకి 150 మంది ప్రొఫెసర్లు లేఖ

కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన లక్షలాది విద్యార్థులు తదుపరి అడుగు కోసం ఎదురుచూస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్థుల కలలను చిదిమేయకూడదని లేఖలో తెలిపారు.
కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ అజెండాకోసం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలిపారు. తగిన జాగ్రత్తలతో షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని.. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణను పూర్తిగా సమర్థిస్తున్నామరి స్పష్టం చేశారు.
కాగా,జేఈఈ, నీట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా రచ్చ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలు ఎలా పెడతారని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాటవద్దని విపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమయంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల నిర్వహణకు మద్దతిస్తూ ప్రధానికి 150 మంది ప్రొఫెసర్లు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నదని, వారి కోరిక మేరకు జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ వెల్లడించారు. పరీక్షకు సంబంధించి ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.