Operation Sindoor: అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..
గురువారం భారత విమానాయన సంస్థలు మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి.

flights cancelled
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గగనతలంపై కేంద్రం ఆంక్షలు విధించడంతో భారతదేశంలోని శ్రీనగర్, లేహ్, జమ్ము, అమృత్సర్, సిమ్లా సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. మే 10వ తేదీ వరకు విమానాశ్రయాలు మూతపడనున్నాయి. ఈ కారణంగా గురువారం 430 భారతీయ విమానాలు రద్దయ్యాయి.
గురువారం భారత విమానాయన సంస్థలు మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి. ఇది దేశం మొత్తం షెడ్యూల్ చేసిన విమానాలలో 3శాతం. పాకిస్థాన్ విమానయాన సంస్థలు 147 విమానాలను రద్దు చేశాయి. ఇది మొత్తం షెడ్యూల్ చేసిన విమానాల్లో 17శాతంగా ఉంది. ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. పాకిస్థాన్, కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న భారతదేశ పశ్చిమ కారిడార్ మీదుగా వైమానిక స్థలంలో పౌర విమాన రాకపోకలు రద్దు చేయడం జరిగిందని, ఈ ప్రాంతాన్ని విమానయాన సంస్థలు సున్నితమైన జోన్ గా పరిగణించి రాకపోకలు బంద్ చేయడం జరిగిందని పేర్కొంది.
మూతపడిన విమానాశ్రయాలు ఇవే..
శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్సర్, లూథియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్కోట్, భుంటార్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్గఢ్, జైసల్మేర్, జోధ్పూర్, బికనీర్, ముంద్రా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, కాండ్లా, కేషోద్, భూర్జ్, గ్వాలియర్, హిండన్ విమానాశ్రయాలను మూసివేశారు.