Toycathon 2021: బొమ్మల తయారీ పరిశ్రమకు అద్భుత భవిష్యత్..మోదీ
దేశంలో ఆట బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Pm Modi (2)
Toycathon 2021 దేశంలో ఆట బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బొమ్మల తయారీ పరిశ్రమకు నిధుల సేకరణ, వినూత్న ఉత్పత్తుల తయారీ, గేమింగ్ ఆలోచనల కోసం నిర్వహించిన టాయ్ కాథోన్-2021 సదస్సులో ప్రధాని వర్చువల్గా పాల్గొన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, డీపీఐఐటీ, వస్త్ర మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఏఐసీటీఈలు సంయుక్తంగా మూడు రోజుల టాయ్ కాథోన్-2021 సదస్సుని నిర్వహిస్తున్నాయి.
టాయ్ కాథోన్-2021 సదస్సులో మోదీ మాట్లాడుతూ.. దేశం కోట్లాది రూపాయల విలువైన 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటుందని, ఈ పరిస్థితిని మార్చడం ముఖ్యమన్నారు. ప్రపంచ బొమ్మల మార్కెట్లో సుమారు వంద బిలియన్ డాలర్ల వాటా కాగా.. భారత్ వాటా 1.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉందన్నారు. ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్తు ఉందన్న మోదీ…దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ ఈ రంగంలో భారత్ వాటాను పెంచాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ మార్కెటలో భారత బొమ్మల తయారీ రంగానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బొమ్మల ప్రాముఖ్యతను మోదీ తెలిపారు. పిల్లల మొదటి పాఠశాల కుటుంబమైతే.. తొలి పుస్తకం, మొదటి నేస్తాలు బొమ్మలేనని అన్నారు. ఈ సందర్భంగా లైవ్ వీడియోకాన్ఫరెన్స్ లో ఐదు టీమ్ లు తమ యూనిక్ బొమ్మల మరియు గేమింగ్ ఐడియాల గురించి తెలిపారు.