పోలీసుల ఆర్డర్ : వాహనాలపై కులం పేర్లు ఉండటానికి వీల్లేదు

మోటారు వాహన చట్టం అమలులో భాగంగా..హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపిన వారికి రూ. 1000 వరకు చలానా విధించి, అదే డబ్బుతో ఉచితంగా హెల్మెట్ అందించాలని నిర్ణయించిన రాజస్థాన్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి వాహనాలపై కులం పేర్లతో పాటు గ్రామం పేరుగానీ..ఆయా పార్టీలకు సంబంధించిన నినాదాలు కానీ ఉండటానికి వీల్లేదంటు ఆదేశాలు జారీ చేశారు. కులం, వృత్తులు, సంస్థలు, హోదాలను వాహనాలపై ప్రదర్శించడం వల్ల సమాజంలో కులతత్వంతో పాటు బేధాభిప్రాయాలు పెరుగుతాయంటూ పౌర సమాజం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు లెటర్ రాసింది. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.
వారి వారి కులాలు, వృత్తులు, సంస్థలు, హోదాలను వాహనాలపై ప్రదర్శించవద్దంటూ ఆదేశించారు. ప్రజలు తమ సంస్థలో వారి కులం,గతంతో వారు పనిచేసిన హోదా, సొంత పేరు, గ్రామం పేరు, వృత్తి, రాజకీయ పార్టీలకు అనుబంధం, నినాదాలు వంటివి వాహనాలపై ఉండకూడదంటు ఆదేశించింది. ఇది ఆఫీసు వాహనాలకే కాక వ్యక్తిగత వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే జోధ్పూర్, జైపూర్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు అందాయి.