మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం..ఆ ఫైల్ పైనే సీఎంగా స్టాలిన్ తొలి సంతకం
తమిళనాడులో భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన డీఎంకే అధినేత స్టాలిన్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని మొదలుపెట్టారు.

Cm Stalin
CM Stalin తమిళనాడులో భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన డీఎంకే అధినేత స్టాలిన్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని మొదలుపెట్టారు. శుక్రవారం తొలిసారి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ పరిపాలనాపరంగా తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు కీలక దస్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఉత్తర్వులపై తొలి సంతకం చేశారు.
ముఖ్యమంత్రిగా స్టాలిన్ తొలి నిర్ణయాలు
-రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సుల్లో మహిళలు అన్ని ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. ఇందుకోసం రూ.1,200 కోట్ల రూపాయలను సబ్సిడీగా విడుదల చేసింది ప్రభుత్వం.
-ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన కీలక హామీ.. పాల ధరల తగ్గింపు. ఈ మేరకు ప్రభుత్వ అధీనంలోని డెయిరీ సంస్థ ఏవియన్ పాలపై లీటరుకు రూ.3 తగ్గించే ఉత్తర్వులపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతకం చేశారు.
-కరోనా కారణంగా ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు రూ.4 వేలు ఇస్తామనే పార్టీ హామీ మేరకు.. రేషన్ కార్డుదారులకు తక్షణం రూ.2000 అందించాలని నిర్ణయించారు. దీనితో రాష్ట్రంలోని 2,07,67,000 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. మిగిలిన 2వేలను త్వరలోనే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
-ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స తీసుకునే వారికి ప్రభుత్వ భీమా పథకం వర్తింపచేయనున్నట్లు ప్రకటించారు స్టాలిన్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు.
-డీఎంకే ఇచ్చిన మరో ముఖ్యమైన హామీల్లో ఒకటైన “మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి” పథకానికి స్టాలిన్ శ్రీకారం చుట్టారు. దీనికింద ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వీకరించిన ప్రజా సమస్యల తాలూకు పిటిషన్లను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు పరిష్కరించనున్నారు. ఈ పథకం అమలు బాధ్యతను ఒక ఐఏఎస్ అధికారికి అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.