కరోనా వ్యాక్సిన్ కోసం సీరంతో చేతులు కలిపిన బిల్ గేట్స్.. 20కోట్ల డోసులు ఉత్పత్తికి ఒప్పందం

  • Published By: vamsi ,Published On : September 29, 2020 / 05:36 PM IST
కరోనా వ్యాక్సిన్ కోసం సీరంతో చేతులు కలిపిన బిల్ గేట్స్.. 20కోట్ల డోసులు ఉత్పత్తికి ఒప్పందం

Updated On : September 29, 2020 / 5:40 PM IST

Serum Institute to boost production of Covid-19 vaccine doses: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చెయ్యడానికి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఇప్పటికే కరోనాని నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీలో పలు కంపెనీలు కష్టపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 200 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయబోతోంది. ఇందుకోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కంపెనీ ఒప్పందం చేసుకుంది. గవి వ్యాక్సిన్ అలయెన్స్‌ కూడా సీరమ్‌, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో చేతులు కలిపింది.

ఈ ఒప్పందంతో భారత్ సహా.. ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ధి చెందని దేశాల ప్రజలకు మేలు జరగనుంది. వచ్చే ఏడాది భారత్ సహా పేద దేశాల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 200 మిలియన్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులను తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.



ఈ 200మిలియన్ డోస్‌లను ఆయా దేశాలకు సరఫరా చేసే బాధ్యతను బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ తీసుకుంటుంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌ను పేద, అభివృద్ధి చెందని దేశాలకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సరఫరా చేస్తుంది వచ్చే ఏడాది నాటికి ఈ డోసుల వ్యాక్సిన్‌ను పేద దేశాలకు సరఫరా చేస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.

ఇదివరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కుదుర్చుకున్న ఒప్పందాలతో పోల్చి చూసుకుంటే.. ఆ సంస్థ మొత్తం 200 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారీ కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థలతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. రెండు, మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ధర(ఒక్కో డోస్‌కి) గరిష్టంగా 3 డాలర్లు (దాదాపు 225 రూపాయలు) ఉంటుందని ఇప్పటికే కంపెనీ ప్రకటించింది.



క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న సమయంలో పేషెంట్లలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. ఆస్ట్రాజెనెకా సంస్థ తాత్కాలికంగా వాటిని నిలిపివేసింది. దాని ప్రభావం వల్ల భారత్‌లోనూ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. అనంతరం మళ్లీ అనుమతులు లభించడంతో క్లినికల్ ట్రయల్స్ పట్టాలెక్కాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రయోగాలను పూర్తి చేయాలని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా లక్ష్యంగా పెట్టుకుంది.