Petrol Deisel Rates : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన
చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు సెంచరీ దాటాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తీయాలంటే

Petrol Deisel Rates
Petrol Deisel Rates : చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు సెంచరీ దాటాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. బతుకు భారంగా మారిందని వాపోతున్నారు. అసలే కరోనా కారణంగా ఉపాధి లేక ఆదాయం లేక విలవిలలాడుతుంటే.. చమురు ధరలు గుదిబండలా మారాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని గంపెడాశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.
పెట్రోల్, డీజిల్ దిగుమతి సుంకాలను తగ్గించబోమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. గతంలో ఇచ్చిన సబ్సిడీల బకాయిల చెల్లింపులే పెట్రోల్ ధరల తగ్గింపునకు ఆటంకమని తెలిపారు. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను కృతిమంగా తగ్గించేందుకు యూపీఏ ప్రభుత్వం చమురు సంస్థలకు బాండ్లను జారీ చేసిందని (రూ.1.44లక్షల కోట్లు), వాటికి తమ ప్రభుత్వం ఇంకా వడ్డీ చెల్లింస్తోదన్నారు. గత ఐదేళ్లలో ఆయిల్ బాండ్లపై రూ.60వేల కోట్ల వడ్డీ చెల్లించామని, ఇంకా రూ.1.3లక్షల బకాయిలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
“రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లను యూపీఏ ప్రభుత్వం జారీ చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. గత యూపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ముందుకెళ్లలేను. ఆయిల్ బాండ్ల భారం మా ప్రభుత్వంపై పడింది. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేకపోతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటే తప్ప పరిష్కార మార్గం లేదు. ఇప్పటికైతే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు సమస్యే లేదు” అని నిర్మలా సీతారామన్ అన్నారు.
“యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్లకు వడ్డీ చెల్లింపులు ఖజానాకు భారంగా మారాయి. గత ఐదేళ్లలో రూ.62 వేల కోట్లకు పైగా వడ్డీ చెల్లించాం. 2026 వరకు రూ.37 వేల కోట్ల వడ్డీ చెల్లించాలి. బాండ్ల బకాయి ఇంకా రూ.1.3 లక్షల కోట్లు ఉన్నాయి. ఆయిల్ బాండ్ల భారం లేకుంటే పెట్రోల్, డీజిల్లపై సుంకాలు తగ్గించగలం” అని మంత్రి వివరించారు.