గుండెనోప్పితో మరోసారి ఆసుపత్రిలో చేరిన గంగూలీ.. ఆందోళనలో అభిమానులు

గుండెనోప్పితో మరోసారి ఆసుపత్రిలో చేరిన గంగూలీ.. ఆందోళనలో అభిమానులు

Updated On : January 27, 2021 / 4:56 PM IST

Sourav Ganguly:టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(48) మరోసారి ఆసుపత్రిలో చేరారు. కోల్‌కతాలోని తన నివాసంలో ఇంతకుముందు జిమ్‌లో వర్క్ఔట్ చేస్తూ అస్వస్థతకి గురై కిందపడిపోయిన గంగూలీకి.. బుధవారం(27 జనవరి 2021) ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

తొలుత గుండెపోటు వచ్చిన సమయంలోనే ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయగా.. 13 మంది డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. అంతా బాగుందని అనుకోగా.. బుధవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన సౌరవ్ గంగూలీ.. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1,349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్‌ 10 వికెట్లని సౌరవ్ పడగొట్టారు.

సౌరవ్ గంగూలీ రెండవసారి ఆసుపత్రిలో చేరారని తెలియగానే, కుటుంబ సభ్యులతో సహా క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.