Supreme Court : మణిపూర్ హింస కేసు.. మైతేయ్ ల పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సీజేఐ సూచించింది. ఒక తెగను ఉగ్రవాదులుగా సంభోదించడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.

Supreme Court reject Meiteis petition
Meiteis Petition Reject : మణిపూర్ హింస కేసులో మైతేయ్ లకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మైతేయ్ లు దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. మణిపూర్ లో జరుగుతున్న హింస జాతి హింస కాదని, మయన్మార్ నుంచి వస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిందని మైతేయ్ కమ్యూనిటీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మణిపూర్ లో అక్రమంగా నల్లమందు సాగు చేయడం వల్ల జాతి హింస చోటు చేసుకుంటోందని, మయన్మార్ నుంచి నిత్యం సరిహద్దులు దాటుతున్న కుకీ ఉగ్రవాదులు ఆయుధాల బలంతో అక్రమంగా నల్ల మందు సాగు చేయాలనుకుంటున్నారని పిటిషన్ లో తెలిపింది.
అయితే ఈ పిటిషన్ ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సీజేఐ సూచించారు. ఒక తెగను ఉగ్రవాదులుగా సంభోదించడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. దీంతో మైతేయ్ కమ్యూనిటీ సంస్థ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది.