Trupti Bhatt : ఒకటి కాదు.. రెండు కాదు.. 16 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇస్రోలోనూ ఆఫర్.. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్.. ఎవరీ త్రీప్తి భట్..?
Trupti Bhatt : త్రీప్తి భట్ ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించానని చెప్పారు.
Trupti Bhatt
Trupti Bhatt : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం లక్ష్యంగా ఎంతో మంది యువత ప్రయత్నాలు చేస్తుంటారు. లక్షలాది మంది యువత, విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి చాలా సంవత్సరాలుగా కష్టపడి చదువుతుంటారు. కానీ, చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాంటి వారిలో ఉత్తరాఖండ్ కు చెందిన త్రీప్తి భట్ ఒకరు.
త్రీప్తి భట్ ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించానని చెప్పారు. నలుగురు తోబుట్టువుల్లో త్రీప్తి భట్ట పెద్దది. చిన్నతనం నుంచే ఉన్నతస్థాయిలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా తల్లిదండ్రులుసైతం ప్రోత్సాహం అందించారు. ఆమె చిన్నతనంలో విద్యాభ్యాసం అల్మోరాలోనే కొనసాగింది. పంత్ నగర్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పొందింది. ఆ తరువాత ఆమె అనేక ఉద్యోగాలకు ఎంపికైంది. NTPC, ISRO వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో అసిస్టెంట్ మేనేజర్గా ఆమెకు ఉద్యోగం లభించింది.
చిన్నతనం నుంచి ఐపీఎస్ అధికారి కావాలని కోరుకున్న త్రీప్తి భట్ అందుకోసం తనకు లభించిన మంచిమంచి ఉద్యోగాలనుసైతం వదలుకుంది. తన లక్ష్యానికి అనుగుణంగా మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారిణి అయింది. ఆమె మొత్తం 16 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. ఐపీఎస్ కావాలనే తన లక్ష్యం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లో వచ్చిన అవకాశాన్ని త్రీప్తి భట్ వదులుకుంది.
తొమ్మిదో తరగతిలో ఉన్న సమయంలో త్రీప్తి భట్ కు మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను కలిసే అవకాశం లభించింది. కలాం స్వయంగా తన చేతులతో రాసిన లేఖను త్రీప్తి భట్ట్ కు ఇచ్చారు. అందులో ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలు ఉన్నాయి. కలాం నుంచి స్ఫూర్తి అందుకున్న ఆమె చదువులో అమోఘంగా రాణించింది.
2013లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి ఆమె చేసిన మొదటి ప్రయత్నంలోనే 165వ ర్యాంకు సాధించి ఐపీఎస్లో చేరాలని నిర్ణయించుకుంది. తన ట్రైయినింగ్ పూర్తయిన తరువాత డెహ్రాడూన్ లో ఎస్పీగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. టెహ్రీ గర్హ్వాల్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కమాండర్గా పనిచేయడానికి ముందు చమోలిలో ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె డెహ్రాడూన్ లో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆమె కేవలం చదువులోనే కాదు.. ఆటల్లో కూడా సత్తా చాటింది. మారథాన్, రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్ని బంగారు పతకం సాధించింది. అలాగే తైక్వాండో, కరాటేలో కూడా నిపుణురాలు అనిపించుకుంది.
