G Ram G: చట్టరూపం దాల్చిన “జీ రామ్ జీ”.. ఇకపై ఈ పథకం కింద మీకు ఏయే ప్రయోజనాలు అందుతాయి?
ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం వీ బీ జీ రామ్ జీ.. 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచుతోంది.
G Ram G: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు ఇవాళ చట్టరూపం దాల్చింది. వీ బీ జీ రామ్ జీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించడంతో చట్టంగా అమల్లోకి వచ్చింది.
ఇటీవలే పార్లమెంట్లో వీ బీ జీ రామ్ జీ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపగా ఆమె ఆమోదముద్ర వేశారని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
యూపీఏ హయాంలో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వీ బీ జీ రామ్ జీ చట్టాన్ని అమలు చేయనున్నారు. ఈ కొత్త పథకాన్ని వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి కోసం తీసుకొచ్చినట్లు కేంద్ర సర్కారు చెబుతోంది.
Also Read: అందుకే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడారు: మంత్రి ఉత్తమ్ రియాక్షన్
ఇకపై ఏయే ప్రయోజనాలు అందుతాయి?
భారత్లో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA ) తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏను రద్దు చేసి ఆ పథకం స్థానంలో వీ బీ జీ రామ్ జీ చట్టాన్ని ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చింది. గ్రామీణ ఉపాధి, జీవనోపాధి లక్ష్యాలతో దీన్ని అమలు చేస్తారు.
- ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి హామీ ఉంటుంది
- ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం వీ బీ జీ రామ్ జీ.. 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచుతోంది
- పనులు పూర్తయ్యాక ఏడు రోజులు లేదా 15 రోజుల్లో చెల్లింపులు జరుగుతాయి
- ఒకవేళ గడువులోపు చెల్లింపులు జరగకపోతే నిరుద్యోగ భత్యం కూడా అందించనుంది
- పథకంలో పనులను నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి మౌలిక సదుపాయాలు, విపత్తు నిరోధకత విభాగాలుగా విభజిస్తారు
- పారదర్శకత కోసం బయోమెట్రిక్స్, జియోట్యాగింగ్ వాడతారు. వివిధ స్థాయుల్లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా ఉంటుంది
- ఎంజీఎన్ఆర్ఈజీఏ కేంద్ర ప్రాయోజిత పథకం. నైపుణ్యంలేని కార్మికుల వేతనాలను కేంద్ర సర్కారు 100% భరిస్తుంది
- నైపుణ్య కార్మికులు, సామగ్రి ఖర్చుల్లో స్వల్ప భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి
- జీ రామ్ జీ పథకంలో మాత్రం కేంద్రం, రాష్ట్రాలు ఖర్చులను 60:40 నిష్పత్తిలో పంచుకుంటాయి
- అయితే, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10 నిష్పత్తి వర్తిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు 100 శాతం కేంద్రం భరిస్తుంది
- వార్షికంగా ప్రతిపాదించిన రూ 1.51 లక్షల కోట్ల వ్యయంలో కేంద్రం రూ 95,692 కోట్లు నిధులు అందిస్తుంది
