23న నామినేషన్ దాఖలు చేయనున్న ప్రియాంకా గాంధీ.. ఆమెకు పోటీగా మహిళా అభ్యర్థిని నిలబెట్టిన బీజేపీ
ప్రియాంకతో పాటు లోక్సభ ప్రతిపక్ష నేత, మాజీ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Priyanka Gandhi
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థి ప్రియాంక గాంధీ కేరళలోని వాయనాడ్లో జరగనున్న పార్లమెంటు ఉప ఎన్నికలకు అక్టోబర్ 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రియాంకతో పాటు లోక్సభ ప్రతిపక్ష నేత, మాజీ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నామినేషన్ దాఖలుకు ముందు ప్రియాంక, రాహుల్ రోడ్షో నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత.. అక్టోబర్ 15న ప్రియాంక అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఆమోదించిన విషయం తెలిసిందే.
ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ వాయనాడ్ మీడియా కోఆర్డినేటర్గా సరళ్ పటేల్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్ స్థానానికి నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. అలాగే, ఝార్ఖండ్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13నే జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు రాహుల్ ఎన్నికైన తర్వాత వయనాడ్ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్
కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలకు నవ్య హరిదాస్ను బీజేపీ పోటీకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రాతో ఆమె తలపడనుంది. అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది.
ఒకప్పుడు ఇన్ఫోసిస్లో ఆఫీస్ బాయ్.. ఇప్పుడు రెండు కంపెనీలకు యజమాని