TMC Leader Farmhouse : బెంగాల్లో సంచలనం.. ట్రావెల్ బ్యాగులు, ప్లాస్టిక్ సంచులలో రూ.500 నోట్లను పెట్టి.. భూమిలో పాతిపెట్టి.. అడ్డంగా దొరికిపోయిన టీఎంసీ నేత..
TMC Leader Farmhouse Cash: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ నగదు అక్రమ నిల్వ వ్యవహారం కలకలం రేపింది. టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్యకు సంబంధించిన ఫామ్హౌస్లోని పొలంలో రూ.2.24 కోట్లకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
West Bengal Police Found Rs 2 Crore 24 Lakh Cash in TMC Leader Dipankar Bhattacharya Farmhouse
TMC Leader Farmhouse : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. టీఎంసీ నేత ఫామ్హౌస్లోని పొలంలో తవ్వకాలు చేయగా.. భారీగా నోట్లకట్టలు బయటపడ్డాయి. ట్రావెల్ బ్యాగులు, ప్లాస్టిక్ సంచులలో రూ.500 నోట్లను పెట్టి భూమిలో పాతిపెట్టారు. వీటిని పోలీసులు వెలికి తీయగా.. మొత్తం రూ.2.24 కోట్ల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ నగదు అక్రమ నిల్వ వ్యవహారం కలకలం రేపింది. ఉత్తర 24పరగణాల జిల్లాలో బదూరియా ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, మున్సిపల్ చైర్మన్ దీపాంకర్ భట్టాచార్యకు సంబంధించిన ఫామ్హౌస్లోని పొలంలో రూ.2.24 కోట్లకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాత్రివేళల్లో టీఎంసీ కార్యాలయం నుంచి అనుమానాస్పదంగా సరుకులు తరలిస్తున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు టీఎంసీ కార్యాలయం, దీంపాకర్ ఫామ్ హౌస్లో తనిఖీలు చేశారు. ఫామ్హౌస్ వెనుక వైపుఉన్న జనపనార తోటలో తనిఖీ చేయగా పోలీసుల కళ్లుబైర్లు కమ్మే విధంగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.
భారీగా పట్టుబడిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల మూటలను పోలీసులు తమ భుజాలపై మోసుకుంటూ పొలం గుండా వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, పొలంలో దొరికిన కరెన్సీ లెక్కపెట్టేందుకు పోలీసులకు ఒకరోజంతా పట్టడం గమనార్హం. అయితే, టీఎంసీ నేతకు చెందిన పొలంలో మొత్తం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్, డ్రోన్ల సహాయంతో గాలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దీపాంకర్ భట్టాచార్యను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.
భారీ నగదుతోపాటు టీఎంసీ నేత ఫామ్హౌస్లో 4వేల ప్రభుత్వ సహాయ టార్ఫాలిన్ షీట్లు, అలాగే కార్యాలయంలో రూ.80లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్ష టీఎంసీపై అధికార పార్టీ అవినీతి ఆరోపణలు చేస్తుండగా.. పోలీసులు నగదు మూలాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
