రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా ? అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్న లేఖ

  • Published By: bheemraj ,Published On : October 30, 2020 / 02:36 AM IST
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా ? అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్న లేఖ

Updated On : October 30, 2020 / 7:23 AM IST

Rajinikanth’s political entry : సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తమిళనాడులో ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత మాత్రం రావడం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీంతో స్పందించిన రజనీ కాంత్.. ఆ లేఖ తాను రాసింది కాదని చెప్పారు. అయితే రాజకీయ ప్రవేశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారా ? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రజనీ పేరుతో బుధవారం ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నా ప్రాణం గురించి నాకు భయం లేదు. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ల క్షేమం గురించి ఆలోచిస్తున్నా. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ఈ రంగంలోకి రావాలనుకున్నా. మధ్యలో నా ఆరోగ్యం క్షీణిస్తే అది కొత్త సవాళ్లకు దారి తీస్తుంది. నాకు కిడ్నీ సమస్య ఉంది. డయాలసిస్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అత్యంత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారు. వ్యాక్సిన్ వచ్చినా కూడా బయటకు వెళ్లడం ప్రమాదకరమని చెప్పారు. అయినప్పటికీ ముందుకెళ్లాలంటే జనవరి 15 లోగా రాజకీయ పార్టీ ప్రారంభించాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది అభిమానులు, ప్రజలకే వదిలేస్తున్నా’..అని రాజనీ అభిమానులను కోరినట్లు లేఖలో ఉంది. దీంతో అభిమానుల్లో ఆందోళనకు గురయ్యారు.

సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ అవడంతో రజనీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ లేఖ తాను రాసింది కాదని స్పష్టం చేశారు. అయితే ఆందులో తన ఆరోగ్యం గురించిన సమాచారం నిజమేనని అన్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లను కలిసి వారి సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడుతూ దీనిపై రజనీ మక్కల్ మండ్రమ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. త్వరలోనే పార్టీ, రాజకీయ ప్రవేశంపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. ‘ఆ లేఖ నాది కాదు. అయితే అందులోని నా ఆరోగ్య సమాచారం నిజమే. సరైన సమయంలో నా రాజకీయ ఆలోచన గురించి ప్రకటిస్తా’ అని రజనీ వివరించారు.

నిజానికి తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ మూడు సంవత్సరాల కిందటే ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాజనీ…‘ముఖ్యమంత్రిని అవ్వాలని ఎన్నికల్లో పోటీ చేయను’ అని స్పష్టం చేశారు. 2021 లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని అభిమానులు భావించారు. కానీ ఇప్పటివరకు దీనిపై స్పష్టత రాలేదు.