జనవరి 9 న జగన్ పాదయాత్ర ముగింపు

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయల మొదలైన ఆయన పాదయాత్ర 2019 జనవరి 9 న ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన 335వరోజు శ్రీకాకుళంజిల్లా పలాస నియోజకవర్గం వంకలూరు, నారాయణపురంలలో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలను కలుపుకుంటూ 134 నియోజకవర్గాల్లో, 3,500 కిమీ మేర పాదయాత్ర సాగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
పాదయాత్ర ముంగింపు సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనవరి 9న ఇచ్చాపురం లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తోంది. జగన్ పాదయాత్ర ముగింపుకు మద్దతుగా బుధవారం 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సజ్జల తెలిపారు. పాదయాత్రలో భాగంగా వేలాదిమంది ప్రజలను జగన్ నేరుగా కలిశారు. ప్రజలు తమ కష్టాలు జగన్ కు వినతి పత్రాలరూపంలో అందచేశారు. గత నాలుగున్నరేళ్ళలో ఏమీ చేయలేని చంద్రబాబు ఎన్నికల ముందు హాడావిడి చేస్తున్నారని ఆయన అన్నారు. ఏడాది కాలంగాసాగిన పాదయాత్ర సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. 2018 నవంబర్ 18న జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా లో ప్రవేశించింది.