కొనసాగుతున్న పవన్ టూర్ : అమరావతిని రాజధానిగా ఉంచుతారా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని టూర్ కొనసాగుతోంది. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రైతులతో ఆయన సమావేశం కానున్నారు. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం అమరావతికి పవన్ చేరుకున్న సంగతి తెలిసిందే. శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో రాజధాని రైతులతో పవన్ సమావేశం కానున్నారు.
రాజధాని ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకొంటున్నారు. నిడమర్రు నుంచి నీరుకొండ వరకు ర్యాలీ చేపట్టారు. రైతులను పలకరిస్తూ మొదటి రోజు పర్యటించారు. పలుచోట్ల మాట్లాడిన పవన్.. రాజధాని మార్పుపై ఫైర్ అయ్యారు. రాజధానిని తరలిస్తామంటే ప్రధాని సైతం కలుస్తానని హెచ్చరించారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్..స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
సీఎంలా కాకుండా వైసీపీ అధినేతగా వ్యవహహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ప్రకటనలతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయని..90 రోజులకే జగన్ పాలనపై ప్రజలపై అసంతృప్తి నెలకొందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. అమరావతి రాజధానిగా ఉంచుతారా ? లేదా ? ఒకవేళ తరలిస్తే అది ఏ ప్రాతిపదికపై తరలిస్తారు ? రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు ? అనే అశంపై స్పష్టత ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.