మహిళా ఎంపీడీవోకి బెదిరింపుల కేసులో వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించారు.

  • Published By: veegamteam ,Published On : October 6, 2019 / 01:50 AM IST
మహిళా ఎంపీడీవోకి బెదిరింపుల కేసులో వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

Updated On : October 6, 2019 / 1:50 AM IST

మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించారు.

మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కోటంరెడ్డి ఇంటి దగ్గర ఆయన అనుచరులు భారీగా చేరుకుంటుండంతో ఆక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వెంకటాచలం ఎంపీడీవో సరళపై దౌర్జన్యానికి దిగిన కేసులో పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు‌. తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని కోటంరెడ్డిపై ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరళ ఫిర్యాదు మేరకు కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు. కోటంరెడ్డిపై 448, 506, 290 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తన ఇంటిపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని వెంకటాపురం ఎంపీడీవో సరళ ఆరోపించారు. గొలగమూడి దగ్గర ఉన్న ఓ లేఔట్‌కు నీటి కనెక్షన్‌ మంజూరు చేయలేదన్న కోపంతో… ఎమ్మెల్యే తనను దుర్భాషలాడారని వాపోయారు. తన ఇంటి విద్యుత్‌, కేబుల్‌ కనెక్షన్లను తొలగించారని…. నీటి పైపులను తీసివేసేందుకు గుంతలను తవ్వించారని సరళ ఆరోపించారు. కోటంరెడ్డి దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎంపీడీవో సరళ… అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని ఆరోపించారు.

ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. పట్టించుకున్న వారు లేరని వాపోయారు. నిరసనగా స్టేషన్ ముందే బైఠాయించారు. ఆమెకు గ్రామ కార్యదర్శులు సంఘీభావం తెలిపారు. చివరకు ఎంపీడీవో సరళ ఫిర్యాదుతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోటంరెడ్డి అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై 290, 506, 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నెల్లూరు జిల్లాలో మహిళా అధికారిపై రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం చేయడం రాజకీయ రంగు పులుముకుంది. కోటంరెడ్డి ప్రవర్తనపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడ్డారు. నిజాయితీగా ఉన్న మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. న్యాయం కోసం మహిళా అధికారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కేసు తీసుకోవడానికే జంకారంటే పోలీసింగ్ ఉన్నట్టా? లేనట్టా? అని తీవ్రంగా మండిపడ్డారు.

కోటంరెడ్డి మాత్రం తాను ఎవర్నీ బెదిరించలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై ఆరా తీశారు సీఎం జగన్‌. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత డీజీపీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీకి స్పష్టం చేసిన సీఎం.. ఆధారాలుంటే చట్ట ప్రకారం ఏ చర్యకైనా వెనుకాడొద్దని ఆదేశించారు.

Also Read : టీఎస్ ఆర్టీసీ కార్మికులకు అందని జీతాలు