హైకోర్టుకు చేరిన రాజస్థాన్ రాజకీయం

  • Published By: venkaiahnaidu ,Published On : July 16, 2020 / 09:43 PM IST
హైకోర్టుకు చేరిన రాజస్థాన్ రాజకీయం

Updated On : July 16, 2020 / 10:35 PM IST

రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌లో రేగిన కల్లోలం హైకోర్టుకు చేరింది. అశోక్‌ గెహ్లోత్‌ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురేసిన వారిపై అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలంటూ.. నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్ వర్గం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. స్పీకర్​ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్ వర్గం దాఖలు చేసిన వ్యాజ్యంపై రేపు విచారణ చేపట్టనుంది రాజస్థాన్​ హైకోర్టు. ఈ వ్యాజ్యం ఈరోజు రాత్రి 7:30గంటలకు విచారించాల్సి ఉన్నప్పటికీ.. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా పడింది.

తొలుత ఈ వ్యాజ్యాన్ని జస్టిస్​ సతీశ్​ చంద్ర విచారించారు. తాజా పిటిషన్​ దాఖలు చేయడానికి సమయం కావాలని సచిన్​ తరఫు న్యాయవాది అభ్యర్థించగా.. న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పిటిషన్​ మళ్లీ విచారణకు వచ్చింది. తాజా పిటిషన్​ను డివిజన్​ బెంచ్​కు సిఫార్సు చేశారు జడ్జి. మళ్లీ రాత్రి 7:30 గంటలKG హాజరుకావాలని కోర్టు చెప్పినట్టు కౌన్సిల్​ ఆఫ్​ కాంగ్రెస్​ చీఫ్​ విప్​ మహేశ్​ జోషీ తెలిపారు. కానీ విచారణ జరగలేదు. ఫలితంగా.. స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసుల రాజ్యాంగబద్ధతపై డివిజన్ బెంచ్ రేపు విచారణ జరపనుంది.

అయితే విచారణ రేపటికి వాయిదాపడటం సచిన్​ వర్గానికి ప్రతికూల విషయం. నోటీసులపై స్పందించడానికి స్పీకర్​ ఇచ్చిన గడువు రేపు మధ్యాహ్నం ఒంటిగంటతో ముగుస్తుంది. కోర్టు అదే సమయానికి పిటిషన్లను విచారించనుంది

పార్టీపై అసంతృప్తితో సచిన్​ పైలట్​ రెబల్​ నేతగా మారారు. ఈ నేపథ్యంలో పైలట్‌తో పాటు ఆయన పక్షాన నిలిచిన 18 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. పైలట్‌తో పాటు ఆయన పక్షాన నిలిచిన 18 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ వారందరికీ.. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సీపీ జోషి నోటీసులు పంపారు.