Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకు ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు.. పోలీసుల కస్టడీ నుంచి విడుదల
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిని అవమానించే విధంగా పవన్ ఖేడా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పవన్ ఖేడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారంటూ విచారణ సందర్భంగా సీజేఐకి బీజేపీ తరపు న్యాయవాది పదే పదే వీడియోను చూపించారు. అయితే ఆ వీడియోను చూసిన అనంతరం ఇది మతపరమైన అంశం ఎలా అవుతుందంటూ సీజేఐ ప్రశ్నించారు.

Supreme Court Relief For Congress' Pawan Khera
Pawan Khera: ఢిల్లీ ఎయిర్పోర్టులో మద్యాహ్నం అరెస్టైన కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాకు సుప్రీంకోర్ట్ ఊరట కల్పించింది. అస్సాం పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన అరెస్టైన కొద్ది గంటలకే విడుదలయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నన్నొక తీవ్రవాదిగా చూశారు. విమానం దిగమని దాదాపుగా అలాగే ప్రవర్తించారు. నాకే కాదు, రేపు ఎవరికైనా ఇలాగే జరగవచ్చు’’ అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించారని అస్సాంలో కేసు నమోదు కావడంతో, అస్సాం పోలీసులు ఢిల్లీకి వచ్చి, విమానం ఎక్కుతున్న పవన్ ఖేడాను దింపి మరీ అక్కడే అరెస్ట్ చేశారు.
ఇక సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పెట్టుకున్న అర్జీపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ ‘‘మేము మిమ్మల్ని రక్షిస్తున్నాము. అయితే మీ ప్రసంగాలు ఒక స్థాయిని దాటకూడదు’’ అని అన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో పవన్ ఖేడాపై నమోదైన కేసుల్ని కలిపేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను అంగీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల విలేకరుల సమావేశంలో అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై పార్లమెంటరీ విచారణను డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ‘‘నరసింహారావు జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటు చేయగలిగారు. అటల్ బిహారీ వాజ్పేయి జేపీసీని ఏర్పాటు చేయగలిగారు. మరి నరేంద్ర గౌతమ్ దాస్.. సారీ దామోదరదాస్.. అరే మోదీ మిస్సైందే?’’ అంటూ పవన్ ఖేడా వ్యాఖ్యానించారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిని అవమానించే విధంగా పవన్ ఖేడా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పవన్ ఖేడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారంటూ విచారణ సందర్భంగా సీజేఐకి బీజేపీ తరపు న్యాయవాది పదే పదే వీడియోను చూపించారు. అయితే ఆ వీడియోను చూసిన అనంతరం ఇది మతపరమైన అంశం ఎలా అవుతుందంటూ సీజేఐ ప్రశ్నించారు. ఇక, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనంతరం భారతీయ జనతా పార్టీలో ఒణుకు పుట్టిందని, దాంట్లోంటే బీజేపీ నేతలు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.