Bhagavad Gita Parayanam : తిరుమల నాదనీరాజనం వేదికపై జరుగుతున్న భగవద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగుస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. అదేరోజున సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నారు.
జనవరి 13న సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలను నిరంతరాయంగా పారాయణం చేస్తారు. ఆతరువాత ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.
అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు పాల్గొంటారని టీటీడీ తెలిపింది.
Also Read : Telangana Weather : తెలంగాణలో పొడి వాతావరణం
భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం నిర్వహిస్తున్నారు. 16 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే పారాయణంలో పాల్గొనాలని టీటీడీ కోరింది.