Ind Vs Eng: రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్.. ఓలీ పాప్ సెంచరీ.. ఆ 3 వికెట్లు బుమ్రాకే..
స్లిప్లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచులు వదిలేశారు. దీన్ని పోప్, డకెట్ సద్వినియోగం చేసుకున్నారు.

Courtesy BCCI
Ind Vs Eng: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 209 రన్స్ చేసింది.
ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీతో కదం తొక్కాడు. 125 బంతుల్లో శతకం చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ బెన్ డకెట్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 94 బంతుల్లో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లలో క్రాలీ (4), జో రూట్(28) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా చెలరేగాడు. 3 వికెట్లు తీశాడు. 13 ఓవర్లు వేసిన బుమ్రా 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముగ్గురు బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ కు పంపాడు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 262 పరుగుల వెనుకంజలో ఉంది. స్లిప్లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచులు వదిలేశారు. దీన్ని పోప్, డకెట్ సద్వినియోగం చేసుకున్నారు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆటను కొనసాగించిన భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మరో 112 పరుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్లు గిల్ (127), పంత్ (65) ఆట మొదటి గంటలో ఇంగ్లాండ్ బౌలర్లుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా పంత్ తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్సర్తో టెస్టుల్లో ఏడో సెంచరీని నమోదు చేశాడు.