క్లీన్ స్వీప్ లక్ష్యంగా భారత్

క్లీన్ స్వీపే లక్ష్యంగా కోహ్లీసేన మరో టెస్టుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆడనున్న ఆఖరి మ్యాచ్ కావడంతో.. చివరి అవకాశాన్ని వాడుకోవాలని ఆరాటంలో ఉన్నప్పటికి కరేబియన్ల సత్తా అనుమానంగానే కనిపిస్తోంది. టీ20 సిరీస్ను 3-0తో, వన్డే సిరీస్ను 2-0తో చేజిక్కించుకున్న భారత జట్టు రెండు టెస్టుల్లో మొదటి మ్యాచ్ను విజయంతో ముగించింది. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ టెస్టుకు ఇక్కడి సబీనా పార్క్ మైదానం వేదిక ఇవ్వనుంది.
ఇరు జట్లు మార్పులతో బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పేసర్ షమీకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటేనే ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు అవకాశం లభిస్తోంది. విండీస్ జట్టులో గాయంతో చివరి నిమిషంలో తొలి టెస్టుకు దూరంగా ఉన్న పేసర్ కీమో పాల్… కమిన్స్ స్థానంలో విండీస్ తుది జట్టులోకి వచ్చే వీలుంది. బ్యాట్స్మెన్ షమారా బ్రూక్స్ను పక్కనపెట్టి రకీమ్ కార్న్వాల్తో అరంగేట్రం చేయించనుంది.
బౌలింగ్ అంత బలహీనంగా ఏమీ లేకున్నా బ్యాటింగ్లో టాపార్డర్ పేలవ ఫామ్ వెస్టిండీస్ను దెబ్బతీస్తోంది. ప్రత్యర్థి పేసర్ల దూకుడు ఉన్నప్పటికీ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతున్నారు బ్యాట్స్మెన్. ఓపెనర్ బ్రాత్వైట్ నిలిస్తేనే ఈ టెస్టులోనైనా పరువు కాపాడుకోగలుగుతారు. క్యాంప్బెల్కు అనుభవం లేదు కాబట్టి బాధ్యతంతా హోప్, చేజ్, హెట్మేయర్లే తీసుకుని నడిపించాలి. ఫేసర్ రోచ్ ఒక్కడికే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీయగల సత్తా ఉంది. గాబ్రియెల్, కీమో పాల్, హోల్డర్ సమష్టిగా పోరాడితే కోహ్లి సేనను కట్టడి చేయగలదు.
పేలవ ఫామ్లో ఉన్న వికెట్కీపర్ బ్యాట్స్మన్ పంత్కు ఈ మ్యాచ్ పరీక్షే. నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతుండటంతో పంత్ స్థానం అనుమానంగానే కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా అతడు ఔటవుతున్న తీరే జట్టు మేనేజ్మెంట్కు అసహనం కలిగిస్తోంది. 0, 4, 65 నాటౌట్, 20, 0, 24, 7.. ఇవి ఈ పర్యటనలో పంత్ సాధించిన స్కోర్లు. ఇప్పటికే సీనియర్ వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టులో ఉండడంతోపాటు కోన భరత్ లాంటి వికెట్కీపర్లు అవకాశం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.
అశ్విన్కు తుది జట్టులో చోటు కూడా ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టులో ఆడించకపోవడం ఆశ్చర్యపర్చినా అతని లోటు కనిపించలేదు. అశ్విన్కు చోటిస్తే పేసర్ షమీని తప్పించాల్సి ఉంటుంది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించాడు. మయాంక్ అగర్వాల్ మంచి స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. వన్డౌన్ బ్యాట్స్మన్ పుజారా వైఫల్యం సైతం అనూహ్యమే. కానీ, తన స్థాయి ఆటగాడికి పుంజుకోవడం పెద్ద పనేం కాదు. కోహ్లి, రహానేకు తోడుగా అతడూ రాణిస్తే జట్టు భారీ స్కోరు అందుకుంటుంది. భారత పేస్ ధాటిని ఎదుర్కొంటూ విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ నిలవగలదా? అనేది పెద్ద ప్రశ్న. ఇషాంత్ కాదంటే బుమ్రా ప్రత్యర్థికి సింహస్వప్నాల్లా కనిపిస్తున్నారు. స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పరుగులు చేస్తూ వికెట్లు తీస్తుండటం టీమిండియాను మరింత బలోపేతం చేసింది.
తుది జట్లు (అంచనా)
భారత్: మయాంక్, రాహుల్, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానే, విహారి, పంత్, జడేజా, షమీ/అశ్విన్, ఇషాంత్, బుమ్రా.
వెస్టిండీస్: బ్రాత్వైట్, క్యాంప్బెల్, బ్రూక్స్/కార్న్వాల్, హోప్, బ్రేవో, చేజ్, హెట్మైర్, హోల్డర్ (కెప్టెన్), కీమో పాల్, రోచ్, గాబ్రియెల్.
పిచ్ పరిస్థితి:
పిచ్ పచ్చికతో ఉంది. పేస్కు అనుకూలంగా తయారు చేశారు. ఇదే మైదానంలో గతంలో బంగ్లాదేశ్పై విండీస్ పేసర్లు చెలరేగారు. 20కి 18 వికెట్లు పడగొట్టి మూడు రోజుల్లోనే టెస్టును ముగించేశారు. వాతావరణం మేఘావృతమై ఉన్నా… వర్షానికి అవకాశం తక్కువే.