PBKS vs RR : అర్ష్దీప్ సింగ్ ఎంత పని చేశావయ్యా.. పాపం బుడ్డోడు.. చారిత్రాత్మక ‘సెంచరీ’ రికార్డు జస్ట్ మిస్..
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య (PBKS vs RR) జరిగిన మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2026 PBKS vs RR Vaibhav Sooryavanshi Falls Short Of Historic Century Courtesy Arshdeep Singh
- పంజాబ్తో మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
- అర్ష్దీప్ సింగ్ కారణంగా రికార్డు ‘సెంచరీ’ మిస్
- ఇంకా ప్రమాదంలోనే కీరన్ పొలార్డ్ రికార్డు
PBKS vs RR : రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. 15 ఏళ్ల ఈ బుడ్డోడు రాజస్థాన్ రాయల్స్కు మెరుపు ఆరంభాలను అందించడం ఓ పనిగా పెట్టుకున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 223 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేశాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్కు చేరుకున్నాడు.
కాగా.. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ తృటిలో ఓ భారీ రికార్డును చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్లో 5 సిక్సర్లు బాదడంతో టీ20ల్లో అతడి సిక్సర్ల సంఖ్య 99కి చేరింది. మరో సిక్సర్ కొట్టి ఉంటే అత్యంత వేగంగా టీ20ల్లో 100 సిక్సర్ల మెలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలిచేవాడు. వైభవ్ కేవలం 511 బంతుల్లో (27 ఇన్నింగ్స్ల్లో) 99 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కీరన్ పొలార్డ్ పేరిట ఉంది. పొలార్డ్ 843 బంతుల్లో 100 సిక్సర్లు బాదాడు.
IPL 2026 PBKS vs RR : మా ఓటమికి వాళ్లే కారణం.. మేము ఆ ఒక్క పనిచేసుంటే గెలిచేవాళ్లం.. శ్రేయాస్ అయ్యర్
ఈ మ్యాచ్లో సూర్యవంశీ 100 సిక్సర్ల మైలురాయిని చేరుకోకపోయినప్పటికి తదుపరి మ్యాచ్ల్లో ఈ మైలురాయిని చేరుకుని, పొలార్డ్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మరో నాలుగు బంతులు ఉండగానే..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (22 బంతుల్లో 62 నాటౌట్), ప్రభ్సిమ్రన్ సింగ్ (44 బంతుల్లో 59 పరుగులు) అర్థశతకాలు బాదారు. కూపర్ కొన్నోలీ (14 బంతుల్లో 30 పరుగులు), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 29 పరుగులు) రాణించారు. ఆర్ఆర్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా రెండు, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్ఆర్ బ్యాటర్లలో డోనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (51; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకాలు బాదారు. వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 43 పరుగులు), శుభమ్ దుబే (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీయగా అర్ష్దీప్ సింగ్ ఓ వికెట్ సాధించాడు.
