WPL 2024 : కేరళ వరదల్లో సర్వసం పోగొట్టుకుంది.. కట్ చేస్తే డబ్ల్యూపీఎల్లో..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఘనంగా ఆరంభమైంది.
![WPL 2024 : కేరళ వరదల్లో సర్వసం పోగొట్టుకుంది.. కట్ చేస్తే డబ్ల్యూపీఎల్లో.. WPL 2024 : కేరళ వరదల్లో సర్వసం పోగొట్టుకుంది.. కట్ చేస్తే డబ్ల్యూపీఎల్లో..](https://10tv.in/wp-content/uploads/2024/02/New-Project-47-2.jpg)
Sajana Sajeevan
WPL : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఘనంగా ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన తొలి పోరులో ఆఖరి బంతికి సజన సిక్స్ కొట్టడంతో ముంబై విజేతగా నిలిచింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సజన పై పడింది. తీవ్ర ఒత్తడిలో బరిలోకి దిగి.. ఆడిన తొలి బంతినే సిక్స్గా మలిచిన సజన సజీవన్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లోని మనంతవాడి అనే కుగ్రామంలో సజీవన్ సజన జన్మించింది. ఆమెకు చిన్నతనం నుంచే క్రికెట్ పై మక్కువ ఎక్కువ. ఆమె తండ్రి ఓ రిక్షా నడుపుతుండేవాడు. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో వేలంలో పాల్గొన్నప్పటికీ ఆమెను ఎవరు కొనుగోలు చేయలేదు. అయితే.. రెండో సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో ముంబై ఇండియన్స్ ఆమెను కొనుగోలు చేసింది. రూ.10లక్షల బేస్ప్రైజ్తో వేలంలోకి వచ్చిన ఆమెను రూ.15లక్షలకు ముంబై సొంతం చేసుకుంది. ఆడిన తొలి మ్యాచ్లోనే ముంబైకి విజయాన్ని అందించింది సజన.
IND vs ENG 4th test : 51 పరుగులు 3 వికెట్లు.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 353 ఆలౌట్
సజన ఇన్నింగ్స్ పై టీమ్ఇండియా ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ స్పందించింది. ఆమె అరంగ్రేటం అదిపోయిందని చెప్పుకొచ్చింది. “మ్యాచ్ ఫలితం మమ్మల్ని నిరాశకు గురి చేసింది. అయితే.. అరంగ్రేట ప్లేయర్ సజన అద్భుతంగా ఆడింది. కేరళ వరదలలో దాదాపు అంతా కోల్పోయింది. నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చింది. ఒక్క బాల్కు 5 పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చి సిక్స్ బాదింది. ఆమె కథ ఎందరినో కదిలిస్తోంది. ఎంతో అద్భుతమైన ప్లేయర్.” అని సోషల్ మీడియాలో జెమీమా రాసుకొచ్చింది. సజన సిక్స్ కొట్టిన వీడియోను షేర్ చేసింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆలిస్ క్యాప్సే (75; 53 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్సర్లు), జెమీమా రోడ్రిక్స్ (42; 24 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్యాన్ని ముంబై ఆరు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. ముంబై బ్యాటర్లో యాస్తిక భాటియా (57; 45 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (55; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్) లు అర్ధశతకాలు చేశారు.
The result was not what we hoped for but what a finish by Sajju the debutant!
Comes from a humble background, lost almost everything in the Kerala floods, walks in when the team requires 1 ball 5 runs and hits an effortless six!
What a story and more over what a player! 🙌🏻 https://t.co/GFed06yrO2
— Jemimah Rodrigues (@JemiRodrigues) February 23, 2024