ప్రశ్నించడమే పాపమా : ధోనికి జరిమానా

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి జరిమానా పడింది. గురువారం(ఏప్రిల్ 11,2019) రాత్రి రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. నో బాల్ విషయమై గ్రౌండ్ లోకి వెళ్లి మరీ అంపైర్లతో ధోని వాదనకు దిగాడు. దీంతో ధోనిపై యాక్షన్ తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అభియోగంపై మ్యాచ్ రిఫరీ ధోనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాడు. మ్యాచ్ ఫీజులో సగం కోత విధించాడు.
ఐపీఎల్లో భాగంగా గురువారం(ఏప్రిల్ 11) చెన్నై, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేజ్ చేసే క్రమంలో చెన్నైకి ఆఖరి ఓవర్ లో 18 పరుగులు అవసరం అయ్యాయి. స్టోక్స్ బౌలింగ్ చేశాడు. తొలి బంతిని జడేజా సిక్సర్ కొట్టాడు. తర్వాత స్టోక్స్ నోబాల్ వేయగా.. జడేజా సింగిల్ తీశాడు. ఫ్రీ హిట్కు ధోని 2 పరుగులు తీశాడు. తర్వాతి బంతికి మహీ ఔటయ్యాడు. చివరి 3 బంతుల్లో చెన్నై 8 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. నాలుగో బంతిని స్టోక్స్… క్రీజులో ఉన్న శాంట్నర్కు నడుం పైకి వేశాడన్న కారణంతో అంపైర్ నోబాల్గా ప్రకటించాడు. 2 పరుగులు వచ్చాయి. అయితే ఇక్కడే అంపైర్లు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
నోబాల్ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా అంపైర్ ప్రకటించడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ఈ నిర్ణయంపై జడేజా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే.. ధోని మైదానంలోకి దూసుకొచ్చాడు. అంపైర్లతో మహీ వాగ్వాదానికి దిగడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. ఐదో బంతికి శాంట్నర్ 2 పరుగులు తీశాడు. ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా స్టోక్స్ వైడ్ వేశాడు. దీంతో లాస్ట్ బాల్ కి 3 పరుగులు చేయాల్సి ఉంది. స్టోక్స్ వేసిన చివరి బంతిని శాంట్నర్ లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టి చెన్నైకి గ్రాండ్ విక్టరీ అందించాడు.