MS Dhoni : రాంచీకి వెళ్లిపోయిన ధోని! తీవ్ర నిరాశలో సీఎస్కే ఫ్యాన్స్..!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎంఎస్ ధోని (MS Dhoni) కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది.
IPL 2026 MS Dhoni In Ranchi Ahead Of CSK vs Gujarat Titans match (PIC CREDIT@IPL)
- అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో సీఎస్కే మ్యాచ్ నేడు
- జట్టుతో పాటు వెళ్లని ధోని
- స్వస్థలం రాంచీకి
MS Dhoni : ఐపీఎల్ 2026 సీజన్లో ఎంఎస్ ధోని కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి మ్యాచ్ను నేడు (మే 21న) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది. ఇప్పటికే సీఎస్కే జట్టు అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ చేస్తుండగా.. ధోని జట్టుతో పాటు వెళ్లలేదని సమాచారం. అతడు చెపాక్ నుంచి నేరుగా తన స్వస్థలం రాంచీకి వెళ్లిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కాగా.. ఈ మ్యాచ్కు సీఎస్కేకు ఎంతో కీలకం. గుజరాత్ పై విజయం సాధిస్తే సీఎస్కే ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకోవచ్చు. భారీ తేడాతో గెలిస్తే నాలుగో స్థానానికి ఎగబాకవచ్చు. అయితే.. చెన్నై ప్లే ఆఫ్స్కు చేరుకునేందుకు గుజరాత్ పై విజయం ఒక్కటే సరిపోదు. మిగిలిన జట్ల సమీకరణాలు కూడా కలిసి రావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఈ సీజన్లో చెన్నై ప్లేఆఫ్స్కు చేరడం దాదాపుగా అసాధ్యమే.
ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని..
ఈ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోని పిక్క గాయంతో బాధపడుతున్నాడని రెండు లేదా మూడు వారాల పాటు అతడు ఆడడని సీఎస్కే మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఆ ఆరువాత అయినా అతడు ఆడతాడని భావించగా మరోసారి నిరాశ తప్పలేదు. జట్టు విజయాలు సాధిస్తున్న సమయంలో జట్టు కూర్పును దెబ్బ తీయకూడదని అతడు భావించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రాక్టీస్ చేస్తుండగా అతడి బొటనవేలికి గాయమైందని వార్తలు వచ్చాయి.
పలు మ్యాచ్లకు ముందు ప్రాక్టీస్ సమయంలో జట్టులో పాటే ఉన్న ధోని, మ్యాచ్ సమయంలో డగౌట్లో మాత్రం కనిపించలేదు. ధోనికి ఇదే చివరి సీజన్ అని ప్రచారం సాగుతుండగా.. గత సీఎస్కే మ్యాచ్లో మహేంద్రుడు ఆడతాడని, చెపాక్లో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. మ్యాచ్కు హాజరైన ధోని ఆడలేదు. మ్యాచ్ అనంతరం మైదానం మొత్తం కలియతిరిగాడు. ఇక సీఎస్కే ప్లేఆఫ్స్కు చేరే అవకాశం లేకపోవడంతో అహ్మదాబాద్ వెళ్లకుండా రాంచీకి వెళ్లిపోయాడు.
ఇక ధోని రాంచీ వెళ్లిన విషయాన్ని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ధ్రువీకరించాడు. అతడు జట్టుతో లేడని చెప్పాడు. ఒకవేళ సీఎస్కే జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తే అతడు జట్టుతో చేరవచ్చునని తెలిపాడు.
