Hardik Pandya : హార్దిక్ పాండ్య గాయపడ్డాడు.. దాన్ని అతడు ఒప్పుకోవడం లేదు : కివీస్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య పై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు
![Hardik Pandya : హార్దిక్ పాండ్య గాయపడ్డాడు.. దాన్ని అతడు ఒప్పుకోవడం లేదు : కివీస్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు Hardik Pandya : హార్దిక్ పాండ్య గాయపడ్డాడు.. దాన్ని అతడు ఒప్పుకోవడం లేదు : కివీస్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు](https://10tv.in/wp-content/uploads/2024/04/Simon-Doull-believes-that-Hardik-Pandya-has-suffered-an-injury.jpg)
Simon Doull believes that Hardik Pandya has suffered an injury
Hardik Pandya – Simon Doull : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య పై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్య గాయంతో బాధపడుతున్నాడని అయితే ఆ విషయాన్ని అతడు ఒప్పుకోవడం లేదన్నాడు. ఐపీఎల్ 2024లో తొలి రెండు మ్యాచుల్లో హార్దిక్ బౌలింగ్ దాడిని ప్రారంభించాడు. ఆ తరువాత రెండు మ్యాచుల్లో అతడు కనీసం ఒక్క ఓవర్ను కూడా వేయలేదు. ఇక గురువారం రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే ఒక్క ఓవర్ను మాత్రమే వేశాడు. 13 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తరువాత మరో ఓవర్ వేయలేదు. గాయంతో పాండ్య బాధపడుతుండడమే ఇందుకు కారణమని తన గట్ ఫీలింగ్ అని డౌల్ చెప్పాడు
‘మొదటి మ్యాచ్లో అతడు బౌలింగ్ దాడిని ఆరంభించారు. అయితే.. ఆకస్మాత్తుగా బౌలింగ్ చేయడం ఆపేశాడు. అతడు గాయపడ్డాడు. అతనిలో ఏదో లోపం ఉందని నేను మీకు చెప్తున్నాను. అతను దానిని ఒప్పుకోవడం లేదు. కానీ ఖచ్చితంగా అతనిలో ఏదో తప్పు ఉంది. అది నా గట్ ఫీలింగ్.’ అని డౌల్ క్రిక్బజ్తో మాట్లాడుతూ అన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో బౌలింగ్ చేయకూడదనే నిర్ణయం గురించి హార్దిక్ను ఇంతకుముందు అడిగాను. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అతను సరైన సమయంలో బౌలింగ్ చేస్తాడని చెప్పాడన్నారు. అది ఓ సాకు మాత్రమేనని డౌల్ అభిప్రాయపడుతున్నాడు.
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతడి చీలమండలానికి గాయమైంది. దీంతో కొంతకాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్తో మైదానంలో అడుగుపెట్టాడు. రెండు మ్యాచుల్లో బౌలింగ్ చేసిన తరువాత అతడి గాయం తిరిగబెట్టిందనే వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజం అయితే.. టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్కు ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బ కానుంది.