Ishan Kishan: ఇషాన్.. ఎంత పనిచేశావ్.. టీమిండియా కొంపముంచిన అప్పీల్!
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ చేసిన తప్పిదం జట్టు ఓటమి కారణం అయిందన్న విమర్శలు వస్తున్నాయి.
India vs Australia 3rd T20: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలయింది. భారీ స్కోరు చేసినా భారత జట్టు అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. పసలేని బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలతో టీమిండియా భారీ స్కోరును కాపాడులేకపోయింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనబడింది. ఆసీస్ బ్యాటర్ల ముందు టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ప్రసిధ్ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చి భారత్ తరపున ఎక్కువ పరుగులు ఇచ్చిన ఆటగాడిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. గువాహటి వేదిక మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
కొంప ముంచిన ఇషాన్ కిషాన్
19 ఓవర్లలో వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ చేసిన తప్పిదం టీమిండియాను చిక్కుల్లో పడేసింది. 19 ఓవర్ల నాలుగో బంతిని అక్షర్ పటేల్ వేయగా.. మాథ్యూ వేడ్ ముందుకు వచ్చి ఆడాడు. బంతిని అందుకున్న ఇషాన్ స్టంపింగ్ చేసి అప్పీల్ చేయడంతో అంపైర్ రీప్లేలో చూశారు. అయితే అది నాటౌట్ గా తేలింది. ఆశ్చర్యకరంగా ఆ బంతిని నోబాల్ గా అంపైర్ ప్రకటించారు. అలా ఎందుకు చేశారో మైదానంలోని ప్రేక్షకులతో పాటు వీక్షకులకు అర్థం కాలేదు. ఇషాన్ తప్పిదం వల్లే అంపైర్ నోబాల్ ఇచ్చారని తర్వాత తెలిసింది. స్టంపింగ్ చేసే క్రమంలో ఇషాన్ గ్లోవ్స్ స్టంప్స్ కన్నా ముందుకు వచ్చాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్ బాల్ వేసిన తర్వాత వికెట్ కీపర్ స్టంప్స్ వెనకాల మాత్రమే బంతిని పట్టుకోవాలి. వికెట్ కీపర్ ధరించిన గ్లోవ్స్ కొంచెం ముందుకు వచ్చినా అంఫైర్ నోబాల్ ప్రకటించవచ్చని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. ఇషాన్ కిషాన్ అప్పీల్ చేయడం వల్లే ఆసీస్ ఫ్రీహిట్ అవకాశం దక్కిందని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
పాపం రుతురాజ్
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసినా జట్టు గెలవలేకపోయింది. టీ20ల్లో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ తరపున సెంచరీ బాదిన బ్యాటర్ గా అతడు నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అతడికిది తొలి సెంచరీ. తాను ఫస్ట్ సెంచరీ చేసిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడం అతడికి చేదు అనుభవాన్ని కలిగించింది. మరోవైపు విధ్వంసకర సెంచరీతో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ జట్టును ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 4 సెంచరీలతో అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును అతడు సమం చేశాడు. మాక్స్వెల్ దూకుడు చూస్తుంటే రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు.