AI Impact Summit 2026 : ఇండియా ఫస్ట్ వరల్డ్ AI ఇంపాక్ట్ సమ్మిట్.. రిజిస్ట్రేషన్ ఎలా? ఫుల్ షెడ్యూల్.. మీ ఫోన్లలో లైవ్ చూడొచ్చు!
AI Impact Summit 2026 : పీఎం మోదీ, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజాలు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరవుతున్నారు.
AI Impact Summit 2026
- భారత ఫస్ట్ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఈరోజు ప్రారంభం
- గూగుల్, ఓపెన్ఏఐ సీఈఓలతో సహా అనేక మంది టెక్ దిగ్గజాలు హాజరవుతారు
- ఈ ఏఐ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది
AI Impact Summit 2026 : భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రపంచ స్థాయి దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే ఫస్ట్ టైమ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సు ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఈరోజు (ఫిబ్రవరి 16) సోమవారం న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 20 వరకు 5 రోజుల పాటు ఈ ఏఐ సమ్మిట్ కొనసాగనుంది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు ఈ ఏఐ సమ్మిట్ లో పాల్గొనున్నారు. ముఖ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ వంటి టెక్ దిగ్గజ ప్రముఖులు హాజరుకానున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు సంబంధించి ఫుల్ షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా? మొబైల్ నుంచి లైవ్ ఎలా చూడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? :
మీరు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రతినిధిగా పాల్గొనాలనుకుంటే ముందుగా అధికారిక వెబ్సైట్ను విజిట్ చేసి మీ పేరు రిజిస్ట్ర్ చేసుకోవాలి.
ఇందుకోసం వెబ్సైట్ లింక్కి వెళ్లి అవసరమైన మీ వివరాలను ఎంటర్ చేయండి.
ఆ తర్వాత డిజిటల్ ఫోటోను అప్లోడ్ చేయండి.
ఇప్పుడు ఇమెయిల్ వెరిఫై కోసం OTP ప్రాసెస్ పూర్తి చేయండి.
రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఇమెయిల్ ద్వారా కన్ఫార్మేషన్, QR కోడ్ అందుతాయి. ఈ ఏఐ సమ్మిట్ ఎంట్రీ కోసం భద్రతా సిబ్బంది ఈ QR కోడ్ను స్కాన్ చేస్తారు. ఫిబ్రవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే కొన్ని సెషన్లకు ప్రతినిధులను అనుమతించరు.
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లైవ్ ఎలా చూడాలి? :
మీరు ఏఐ సమ్మిట్ను లైవ్ స్ట్రీమింగ్ చూడాలనుకుంటే అన్ని కీలక సెషన్లు IndiaAI అధికారిక YouTube ఛానెల్లో లైవ్ అవుతాయి.
ప్రముఖ టెక్ దిగ్గజాల కీలక ప్రసంగాలు :
- టెక్ సీఈఓతో ప్రత్యేక చిట్ చాట్
- ప్యానెల్ డిస్కషన్
- ఏఐ ఎక్స్పో టూర్
- ఏఐ విధానం, టెక్నాలజీకి సంబంధించి కీలక ప్రకటనలు
ఈ లైవ్ స్ట్రీమింగ్ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రపంచ నేతలు టెక్ దిగ్గజాలు ఎవరెవరంటే? :
ఈ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం అనేక మంది ప్రముఖ అంతర్జాతీయ నేతలు, టెక్ పరిశ్రమకు చెందిన దిగ్గజ ప్రముఖులు ఒకేచోట చూడొచ్చు.
- సుందర్ పిచాయ్, సీఈఓ, గూగుల్
- సామ్ ఆల్ట్మాన్, సీఈఓ, ఓపెన్ఏఐ
- డెమిస్ హస్సాబిస్, డీప్మైండ్ టెక్నాలజీస్
- డారియో అమోడీ, సీఈఓ, ఆంత్రోపిక్
- బ్రాడ్ స్మిత్, మైక్రోసాఫ్ట్
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా సహా 45కి పైగా దేశాల ప్రతినిధులు కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్నారు.
ఏఐ సమ్మిట్ ప్రత్యేకతలేంటి? :
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా 5 రోజులలో 700కి పైగా సెషన్లు జరుగుతాయి. ఈ చర్చలు అనేక ముఖ్యమైన ఏఐ అంశాలపైనే ఉంటుంది.
- ఏఐ భద్రత, రిస్క్ మేనేజ్ మెంట్
- ఏఐ పాలసీ, నిబంధనలు
- డేటా భద్రత, గోప్యత
- ఏఐ బాధ్యతాయుతమైన వినియోగం
- భవిష్యత్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం
- అదనంగా, ఏడు వర్కింగ్ గ్రూపులు ఏఐ కామన్స్, విశ్వసనీయ ఏఐ టూల్స్, షేర్డ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రతిపాదనలు ఉంటాయి.
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 పూర్తి షెడ్యూల్ :
ఫిబ్రవరి 16 (సోమవారం) :
కీలక ప్రసంగాలు, విధాన ఆధారిత ప్యానెల్ చర్చలు, నిపుణుల రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఇండియా ఏఐ ఎక్స్పో కూడా ఈ రోజున ప్రారంభమవుతుంది.
ఫిబ్రవరి 17న (మంగళవారం) :
వివిధ రంగాలలో ఏఐ వాడకంపై లోతైన చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, ఇంధనం, విద్య, వ్యవసాయం, లింగ సాధికారత, వికలాంగులకు సంబంధించిన ఏఐ కేస్బుక్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది.
ఫిబ్రవరి 18 (బుధవారం) :
ఆ తర్వాత ఫిబ్రవరి 18న పరిశోధన, అభ్యాసంపై దృష్టి సారిస్తారు. ప్రపంచ టెక్ నేతలు, స్టార్టప్లు, ఇండస్ట్రీ నిపుణులు రీసెర్చ్ సింపోజియం, ఇండస్ట్రీ పరిశ్రమ సెషన్లలో వారి పరిష్కారాలను అందిస్తారు.
ఫిబ్రవరి 19 (గురువారం) :
ఏఐ సమ్మిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ తరువాత ప్రపంచ పరిశ్రమల నేతలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలతో సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. బాధ్యతాయుతమైన, భవిష్యత్తు ఆధారిత ఏఐ గురించి చర్చిస్తారు.
ఫిబ్రవరి 20 (శుక్రవారం) :
చివరి రోజు, ఫిబ్రవరి 20న, గ్లోబల్ పార్టనర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GPAI) సభ్యుల కౌన్సిల్ సమావేశాలు ఉంటాయి. ఇందులో బాధ్యతాయుతమైన సమగ్ర ఏఐపై బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరుగుతాయి.
