8th Pay Commission : రిటైర్డ్ ఉద్యోగుల్లో టెన్షన్.. 8వ పే కమిషన్ గందరగోళం.. పాత పెన్షనర్లకు వర్తించదా? కేంద్రం ఫైనల్ మాట!
8th Pay Commission : నవంబర్ 3, 2025న 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటును కేంద్రం నోటిఫై చేసింది. అప్పటి నుంచి డిసెంబర్ 31, 2025న లేదా అంతకుముందు పదవీ విరమణ చేసిన వారు కొత్త పెన్షన్ సవరణ పరిధిలోకి వస్తారా? లేదో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
8th Pay Commission
- 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్
- లక్షలాది మంది పెన్షనర్లలో తీవ్ర ఆందోళన
- డిసెంబర్ 31, 2025కి ముందు రిటైర్ అయిన పెన్షన్లరకు వర్తించదా?
- పెన్షన్లలో మార్పుల నుంచి ప్రయోజనం పొందుతారా?
8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే టెన్షన్.. 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు? జీతాలు ఎప్పుడు పెరుగుతాయి? పెన్షన్లు పెరుగుతాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు చాలామంది పెన్షనర్లలో కొత్త పెన్షన్ సవరణకు సంబంధించి ఆందోళన మొదలైంది.
డిసెంబర్ 31, 2025 లేదా అంతకన్నా ముందే రిటైర్ అయిన ఉద్యోగులకు కొత్త పెన్షన్ సవరణ పరిధిలోకి వస్తారా? లేదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
లక్షలాది మంది పెన్షనర్లలో ఆందోళన :
వాస్తవానికి, ఆర్థిక చట్టం, 2025 ప్రస్తుత పెన్షన్ నియమాలకు సంబంధించి కీలక నిర్ణయాలను వెల్లడించింది. అప్పటినుంచి లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లలో ఈ ఆందోళన మొదలైంది. పాత, కొత్త పెన్షనర్ల మధ్య వ్యత్యాసం ఉంటుందని కొన్ని వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో పెన్షన్ల సవరణపై వైఖరిని స్పష్టం చేసింది.
8వ వేతన సంఘం గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అందులో ఒక ప్రశ్న.. “డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందు పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, 8వ కేంద్ర వేతన సంఘం ప్రకారం వారి పెన్షన్లలో మార్పుల నుంచి ప్రయోజనం పొందుతారా? దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్వయంగా సమాధానమిచ్చారు.
Read Also : Best Realme Phones : రియల్మి ఫ్యాన్స్ కోసం రూ. 35వేల లోపు 6 ఖతర్నాక్ ఫోన్లు.. రెండో ఫోన్ రేంజే వేరబ్బా..!
ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఏమన్నారంటే? :
లోక్సభలో ఆయన సమాధానమిస్తూ.. “కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం, భత్యాలు, పెన్షన్లపై తమ సిఫార్సులను ఇచ్చే పనిని 8వ సీపీసీకి అప్పగించారు” అని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. అంటే.. 8వ వేతన సంఘం అనేది కేవలం ఉద్యోగుల వేతనాలు, డియర్నెస్ అలవెన్స్ (DA) వంటి భత్యాలకే పరిమితం కాదు.
రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లపైనా కూడా ప్రభావం పడుతుంది. పెన్షన్ వ్యవస్థను వేతన సంఘం నేరుగా నిర్వహించదు. పెన్షన్కు సంబంధించి ప్రతి నియమం ఇప్పటికే అమల్లో ఉన్న సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నియమాలు 2021, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (అసాధారణ పెన్షన్) నియమాలు, 2023 ద్వారానే అమలు అవుతాయి.
వేతన సంఘం కొన్ని సిఫార్సులు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం సాధారణ ఉత్తర్వులు జారీ చేసి అమల్లోకి తీసుకువస్తుంది అంతే.. ఇక్కడ వేతన సంఘం ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. కానీ, అమలు మాత్రం ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలు, ప్రస్తుత పెన్షన్ నియమాల ప్రకారమే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగేలా వేతనాలు, భత్యాలు, పెన్షన్లు ఒకేలా సవరిస్తుంది.
