Facebook News Tab : ఫేస్బుక్ పబ్లిషర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ‘న్యూస్ ట్యాబ్’ కనిపించదు.. నో పేమెంట్..!
Facebook News Tab : ఫేస్బుక్ న్యూస్ పబ్లిషర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. న్యూస్ కంటెంట్పై చెల్లింపులను నిలిపివేస్తుంది. ఏప్రిల్ 2024 నుంచి పలు దేశాల్లోని ప్లాట్ఫారమ్ నుంచి ఈ న్యూస్ ట్యాబ్ను తొలగించనుంది.
Facebook News Tab : ఫేస్బుక్ న్యూస్ పబ్లిషర్లకు షాకింగ్ న్యూస్.. వచ్చే ఏప్రిల్ 2024 ప్రారంభంలో ఫేస్బుక్ ప్లాట్ఫారమ్ నుంచి న్యూస్ ట్యాబ్ తొలగించనుంది. తద్వారా వార్తలను పోస్టు చేసే యూజర్లకు చెల్లింపులను కూడా నిలిపివేయనుంది. కొత్తగా యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాలోని మెటా ప్లాట్ఫారమ్ నుంచి న్యూస్ ట్యాబ్ను తొలగించనున్నట్టు ఫేస్బుక్ షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. మెటా నిర్ణయంతో సెప్టెంబరు 2023లో ప్రకటించిన విధంగా యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీలలో ఫేస్బుక్ న్యూస్ ఫీచర్ అదృశ్యం కానుంది.
సోషల్ మీడియా దిగ్గజం ప్రకారం.. ఆస్ట్రేలియా, అమెరికాలో ఫేస్బుక్ న్యూస్ వినియోగం గణనీయంగా తగ్గింది. గత ఏడాదిలో 80 శాతానికి పైగా తక్కువగా నమోదైంది. ప్రధానంగా వార్తలు లేదా రాజకీయ కంటెంట్ను చదివేందుకు వినియోగదారులు ఇష్టపడటం లేదని, వినోదం వంటి ఇతర కంటెంట్ చూసేందుకు ఈ ప్లాట్ఫారమ్ను ఎక్కువగా ఉపయోగిస్తారని ఫేస్బుక్ పేర్కొంది.
ట్విట్టర్ (X) తరహాలోనే వార్తలు, రాజకీయాలపై దృష్టిసారించే సోషల్ ప్లాట్ఫారంగా కొనసాగడం ఇష్టం లేకనే న్యూస్ ట్యాబ్ నిలిపివేయడానికి ప్రధాన కారణంగా మెటా కంపెనీ స్పష్టం చేసింది. ఎంటర్టైన్మెంట్ కంటెంట్తో పోలిస్తే.. న్యూస్ కంటెంట్ ద్వారా ఫేస్బుక్ కు వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉందని పేర్కొంది.
న్యూస్ ట్యాబ్ తొలగించినా.. వెబ్సైట్ల లింకులు పోస్టు చేసుకోవచ్చు :
మెటా న్యూస్ ట్యాబ్ తొలగించినప్పటికీ.. ఎప్పటిలాగే ఫేస్బుక్లో షేర్ చేసిన లింక్ల ద్వారా యూజర్లు న్యూస్ కంటెంట్ యాక్సెస్ చేయగలరు. న్యూస్ పబ్లిషర్లు తమ అకౌంట్లు, పేజీలకు యాక్సస్ కూడాకలిగి ఉంటారు. అంతేకాదు.. న్యూస్ స్టోరీల లింక్లను పోస్ట్ చేయడానికి, వినియోగదారులను వారి వెబ్సైట్లకు రీడైరెక్ట్ అవుతాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదని కంపెనీ స్పష్టం చేసింది. అదనంగా, న్యూస్ పబ్లిషర్లు ఎక్కువ మంది ఫాలోవర్లను చేరుకోవడానికి తమ ప్లాట్ఫారమ్లకు ట్రాఫిక్ని తెచ్చుకోవడానికి రీల్స్, యాడ్స్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు, ఫేస్బుక్ అవుట్బౌండ్ లింక్ల నుంచి వచ్చే ఆదాయంలో 100 శాతం ఉంచుకోవచ్చు.
ఆ దేశాల పబ్లిషర్లకు నో ఎఫెక్ట్ :
అమెరికా, యూకేలో ఇప్పటికే డీల్ ముగిసినప్పటికీ.. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీలలోని న్యూస్ పబ్లిషర్లతో ఇప్పటికే ఉన్న ఒప్పందాలు ఈ నిర్ణయంతో ప్రభావితం కాలేదని ఫేస్బుక్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ దేశాల్లో సంప్రదాయ వార్తల కంటెంట్ కోసం కొత్త వాణిజ్య ఒప్పందాలను కొనసాగించబోమని, భవిష్యత్తులో న్యూస్ ప్లబిషర్ల కోసం ప్రత్యేకంగా కొత్త ఫేస్బుక్ ప్రొడక్టులను ప్రవేశపెట్టబోమని కంపెనీ పేర్కొంది.
ఫేస్బుక్ తమ ప్లాట్ఫారంపై వినియోగదారులకు విశ్వసనీయ సమాచారాన్ని అందించడమే లక్ష్యమని చెబుతోంది. తప్పుడు సమాచారం వ్యాప్తిని ఎదుర్కోవడానికి ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్వర్క్ వంటి సంస్థలచే గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఫ్యాక్ట్-చెకర్లతో కలిసి పనిచేస్తోంది.
2016 నుంచి ఫేస్బుక్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్లలో 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులను మరింత కొనసాగించాలని మెటా కంపెనీ యోచిస్తోంది. ఫేస్బుక్ ఫీడ్ నుంచి న్యూస్ ట్యాబ్ను తొలగించడం వల్ల యూజర్ ఎంగేజ్మెంట్కు ప్రాధాన్యత పెరగనుంది. వినియోగదారుల ప్రాధాన్యతలతో సర్వీసులను మరింత మెరుగుపర్చడమే కంపెనీ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అయితే, ఈ నిర్ణయంతో మెటా ప్లాట్ఫారమ్లో న్యూస్ కంటెంట్ వినియోగం, మీడియా ల్యాండ్స్కేప్పై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.