Bandi Sanjay: అల్లు అర్జున్ ఇష్యూ.. రేవంత్ సర్కార్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay: సంధ్య థియేటర్ ఘటన విషయంలో సినీ హీరో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయనకు బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా రేవంత్ తీరు ఉందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతిఒక్కరూ ఖండించారు. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకోవడంతోపాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు. సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవల్ లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గుచేటు అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: సినిమా కలెక్షన్ల మీద ధ్యాస తప్ప.. ప్రజలు ఏమైతున్నరో పట్టదా..? కాంగ్రెస్ ఎంపీ ఫైర్
ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచింది. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి అధోగతి పడుతుందని సంజయ్ సూచించారు. మీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చనిపోతుంటే ఏనాడైనా పరామర్శించారా? హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకుగురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా? మీకో న్యాయం.. ఇతరులకు ఒక న్యాయమా? అంటూ బండి సంజయ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. లేనిపక్షంలో బీఆర్ఎస్ కు పట్టినగతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు.