Telangana Assembly Election 2023 : కాయ్ రాజా కాయ్… తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ దందా
కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. కాదేది అనర్హం అన్నట్లు బెట్టింగులకు క్రికెట్ మ్యాచ్లే కాదు తెలంగాణ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు....
![Telangana Assembly Election 2023 : కాయ్ రాజా కాయ్… తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ దందా Telangana Assembly Election 2023 : కాయ్ రాజా కాయ్… తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ దందా](https://10tv.in/wp-content/uploads/2023/11/Betting-on-Telangana-electi.gif)
Betting on Telangana elections
Telangana Assembly Election 2023 : కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. కాదేది అనర్హం అన్నట్లు బెట్టింగులకు క్రికెట్ మ్యాచ్లే కాదు తెలంగాణ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు. కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసి పోలింగ్ పర్వం గురువారం జరగనుండటంతో బెట్టింగ్ రాయుళ్లు వివిధ రాజకీయ పార్టీల విజయాలపై జోరుగా పందాలు కాస్తున్నారు.
హైదరాబాద్ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో సైతం తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ హవా సాగుతోంది. దేశవ్యాప్తంగా అంతటా తెలంగాణ ఎన్నికల గురించి ప్రజలు చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం గురించి, వివిధ పార్టీల ప్రచారం, నేతల పంచ్ డైలాగులపై సోషల్ మీడియాలో వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎన్నికలపై బుకీలు బెట్టింగ్ దందాను ప్రారంభించారని సమాచారం.
ఇప్పటికే కోట్ల రూపాయల మేర బెట్టింగులు కాశారు. నవంబరు 30 వతేదీ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 3వతేదీ ఓట్ల లెక్కింపు తేదీ వరకు బెట్టింగ్ లు 9 కోట్ల రూపాయలు దాటుతాయని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్ రాయుళ్లు నెలరోజుల క్రితమే పందాలు కాశారని ఓ మాజీ పోలీసు అధికారి చెప్పారు. హైదరాబాద్ నగరం కంటే కూడా ఇతర ప్రాంతాల్లో ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి.
ALSO READ : Money Seized : పోలింగ్కు కొన్ని గంటల ముందు కలకలం.. భారీగా పట్టుబడిన నగదు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో బయటి ప్రాంతాల్లో బుకీలు పాగా వేసి బెట్టింగ్ దందా ప్రారంభించారని సమాచారం. ముంబయి,ఢిల్లీ, కోల్ కతాతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాల్లో తెలంగాణ ఎన్నికల పందాలు సాగుతున్నట్లు వెల్లడైంది. విదేశాల్లోని లండన్, అమెరికా ప్రాంతాల నుంచి కూడా బుకీలు ఆన్ లైన్ యాప్ ద్వారా పందాలు కాస్తున్నారు. కోడి పందాలకు కేంద్రమైన భీమవరం పట్టణంలో తెలంగాణ ఎన్నికలపై పందాలు లక్షల్లో సాగుతున్నాయి.
ALSO READ : గ్రామాల్లో అత్యధికం… నగరాల్లో అత్యల్పం… ఇదీ గత ఎన్నికల్లో ఓటింగ్ తీరు
ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ బెట్టింగ్ రాయుళ్లు తెలంగాణ నేతలు, వ్యాపారులతోనూ పందాలు కాస్తున్నారు. ఓ బడా వ్యాపారి కోట్ల రూపాయల్లోనే పందెం కాశారని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని కొందరు పందాలు కాస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ పక్షాన కూడా బెట్టింగులు కాస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల అంశం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది డిసెంబరు 3వతేదీ ఓట్ల లెక్కింపు తేదీ వరకు వేచి చూడాల్సిందే.