Money Seized : పోలింగ్కు కొన్ని గంటల ముందు కలకలం.. భారీగా పట్టుబడిన నగదు
డబ్బుని సీజ్ చేసిన పోలీసులు.. నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలింగ్ కు కొన్ని గంటల ముందు భారీగా నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. అధికారులు, పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయల నగదు పట్టుబడింది.
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నోట్ల కట్టల కలకలం రేగింది. ఎస్వోటీ పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. రెండు కార్లలో తరలిస్తున్న కోటి 68 లక్షల రూపాయల నగదును రాయదుర్గం SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖాజాగూడలో తనిఖీలు చేస్తుండగా కార్లలో నగదు దొరికింది. డబ్బుని సీజ్ చేసిన పోలీసులు.. డబ్బు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరైన పత్రాలే లేకపోవడంతో ఆ డబ్బుని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ఎన్నికల్లో ఉపయోగించే సిరా హిస్టరీ మీకు తెలుసా?
ఈ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. కాగా, ఈ నగదును జడ్చర్లకు చెందిన ఓ పార్టీ అభ్యర్థికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన నగదును ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు.
అటు మంచిర్యాల కేంద్రంలోని సున్నంబట్టి వాడ వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న 15లక్షల 81వేల రూపాయలు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read : ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఈ రెండు రోజులు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు?
అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో బైక్ పై తరలిస్తున్న రూ.10 లక్షల నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నోట్ల కట్టలను నడుముకు కట్టుకుని బైక్ పై వెళ్తుండగా.. వెంబడించి మరీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు.