రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. మీరు ఈ పని చేయకపోతే మీ రేషన్ కార్డు కట్..! కేంద్రం స్ట్రిక్ట్ ఆర్డర్స్..
రాష్ట్రంలో గత ఆర్నెళ్లుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

Ration Card: పేద వర్గాల ప్రజలకు రేషన్ కార్డు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ నెల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తున్న విషయం తెలిసిందే. కొందరు లబ్ధిదారులు కొన్ని నెలలుగా రేషన్ తీసుకోవటం లేదు.. ఆర్నెళ్లు, ఆపైన రేషన్ తీసుకోని వారి కార్డులను రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది.
రాష్ట్రంలో గత ఆర్నెళ్లుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ కార్డులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాళని రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆర్నెళ్లు, ఆపైన రేషన్ తీసుకోని కార్డులపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే 80శాతానికిపైగా కార్డుల పరిశీలన పూర్తి చేశారు. ఈ పరిశీలన ప్రక్రియలో కీలక విషయాలను అధికారులు గుర్తించారు.
కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన జాబితాలో రేషన్ తీసుకోకుండా ఉన్న కార్డులతో పాటు, ఆధార్ వివరాల్లో లోపాలున్న కార్డులను కూడా చేర్చింది. అయితే, ఇప్పటి వరకు రాష్ట్ర అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన కార్డుల్లో 30శాతం కార్డులు అర్హత లేవని గుర్తించారు.
ఆరు నుంచి 12 నెలల కాలంగా రేషన్ తీసుకోని కార్డుల్లో పలు అనర్హులున్నట్లు గుర్తించారు. కొందరు లబ్ధిదారులు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు కలిగి ఉండటం, మరికొందరు కార్డు హోల్డర్లు చనిపోవడం, డూప్లికేట్ ఆధార్ కార్డుల ద్వారా రేషన్ కార్డులు పొందడం, 18ఏళ్లు నిండని వ్యక్తుల పేరిట కార్డులు జారీ కావడం, ఆధార్ కార్డులో ఉన్న పేర్లు, రేషన్ కార్డులో మరొకరి పేరిట ఉండటం వంటి లోపాలు బయటపడ్డాయి. మరోవైపు.. బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చి రేషన్ కార్డులు తీసుకున్న వారు తిరిగి స్వస్థలాలకు వెళ్లడంతో కూడా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని తేలింది. అయితే, సివిల్ సప్లయ్ అధికారులు సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు.
రాష్ట్ర సవిల్ సప్లయ్ అధికారుల విచారణ పూర్తయిన తరువాత అనర్హత కారణాలతో కేంద్రం పంపిన లిస్టులో ఉన్న చాలా వరకు కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.