Ration Cards: రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. ఈ నెల 25 నుంచి పంపిణీ.. కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

Ration Cards: రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. ఈ నెల 25 నుంచి పంపిణీ.. కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Updated On : July 21, 2025 / 7:08 PM IST

Ration Cards: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్ అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి ఉండేది కాదని.. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్న బియ్యం ఇస్తుండటంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.

రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని చెప్పారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్ చేసుకోవాలన్నారు. ప్రతీ మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలని సీఎం రేవంత్ చెప్పారు.

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైనా.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు.

Also Read: గోడకు కన్నం వేసి.. షట్టర్ కట్ చేసి.. 18 కిలోల బంగారం చోరీ.. సూర్యాపేటలో భారీ దొంగతనం

అన్ని విభాగాలను అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్లతో చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీంలను పంపిస్తున్నామని సీఎం తెలిపారు. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్ లో ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ చెప్పారు.

”జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలి. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పీహెచ్ సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి.

కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. కలెక్టర్లు కచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలి. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టును సీఎస్ అందించాలి. వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి వాటర్ మేనేజ్ మెంట్ ఉండాలి. 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాం. యూరియా స్టాక్ కు సంబంధించి ప్రతీ ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై డిస్ ప్లే చేయాలి. స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు. ఆందోళన అవసరం లేదు. కావాల్సినంత యూరియా స్టాక్ ఉంది. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోండి. రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదు. ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయండి.