“ఇందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు”.. కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌

తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తుందని మరోసారి రుజువైందని చెప్పారు.

“ఇందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు”.. కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌

Updated On : April 30, 2025 / 5:45 PM IST

దేశంలో వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేయాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్ర క్యాబినెట్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సర్కారు నిర్ణయంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందని, రాహుల్ విపక్షంలో ఉన్నప్పటికీ కేంద్ర సర్కారు విధానాన్ని ప్రభావితం చేశారని అన్నారు.

దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణనకోసం కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పోరాడిందని చెప్పారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తుందని మరోసారి రుజువైందని ట్వీట్ చేశారు.

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా?
అంతకుముందు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడని, ఆయన జయంతి రోజున పదో తరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. బసవన్న స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. “మొన్న ఒకాయన వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్ ను విమర్శించారు. వాళ్లు రజతోత్సవాలు, విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది.

Also Read: మోదీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. దేశ వ్యాప్తంగా కులగణన..

వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వాళ్లు. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది? ప్రతిపక్ష నాయకుడిగా రూ.65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు.

మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడారు. రైతు బంధు, ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది? మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా?

మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం.
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి కేసీఆర్. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ మాటల్లో, కళ్ల ల్లో విషం కనిపిస్తోంది.

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? పదేళ్లు దోచుకున్న నీకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదు ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం. వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే విధానంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.