యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కారేపల్లి మండలం గంగారం తండాకువెళ్లి నూనావత్ అశ్విని, మోతిలాల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revnath Reddy

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కారేపల్లి మండలం గంగారం తండాకు చేరుకున్నారు. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగులో కారుతోసహా కొట్టుకుపోయి నూనావత్ మోతిలాల్, అశ్విని మృతిచెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. అశ్విని, మోతిలాల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ వరద నీటిలో కొట్టుకుపోయి మరణించడం నన్ను కలచివేసిందని అన్నారు.

Also Read : ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు.. హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

ఇది దారుణమైన ఘటన. తీరని శోకం మిగిలింది. ఏం చెప్పినా ఎంత చెసినా తక్కువే. మీ కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేనిది. ధైర్యం కోల్పోవద్దు. మీకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి అశ్విని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలోని సీతారామా తండ్రా పర్యటనకు రేవంత్ వెళ్లారు.

Also Read : CM Revanth Reddy: భారీ వర్షాలు.. ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు నూనావత్ మోతీలాల్ (45), నూనావత్ అశ్వని (26) వరదనీటిలో గల్లంతై మరణించారు. అశ్వని ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ వ్యవసాయ యూనివర్శిటీ శాస్త్రవేత్తగా పనిచేస్తుంది. ఆమె సోదరుడికి నిశ్చితార్థానికి వచ్చి ఆదివారం తెల్లవారుజామున తండ్రి మోతీలాల్ తో కలిసి హైదరాబాద్ విమానాశ్రయానికి కారులో బయలుదేరింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జీపై నుంచి పారుతున్న ఆకేరు వాగులోనే కారును పోనిచ్చారు. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. తమను రక్షించాలని కుటుంబ సభ్యులకు తండ్రి, కూతురు ఫోన్ చేశారు. కొద్దిసేపటికే వారు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. సమీపంలోని తోటలో అశ్విని మృతదేహం లభ్యమైంది.