Eatala Rajender: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) బీజేపీలో చేరే విషయంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. వారిద్దరితో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇతర నేతలు దాదాపు 5 గంటల పాటు చర్చించారు.
అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తాము సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని పొంగులేటి, జూపల్లి కృష్ణారావు చెప్పారని ఈటల అన్నారు. అనుచరులు, మద్దతుదారులతో మాట్లాడి తుది నిర్ణయం చెబుతామని వారిద్దరు అన్నట్లు ఈటల రాజేందర్ చెప్పారు.
తమ లక్ష్యం, పొంగులేటి, జూపల్లి కృష్ణారావు లక్ష్యం సీఎం కేసీఆర్ ను గద్దె దించడమేనని అన్నారు. తమ పార్టీలో చేరడంపై వారిద్దరూ సానుకూల నిర్ణయం తీసుకుంటారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలలో తాము పొంగులేటి, జూపల్లి కృష్ణారావును కలిశామని వివరించారు. సీఎం కేసీఆర్ ధనాన్ని ఆశ చూపి నేతలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాగా, ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని, తాము ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటామని జూపల్లి కృష్ణారావు అన్నారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారు ఏ పార్టీలో చేరతారన్న ఆసక్తి నెలకొంది.
Jupally, Ponguleti: పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్.. క్లారిటీ ఇచ్చిన నేతలు