Godavari Flood: గోదావరి మహోగ్రరూపం.. 69అడుగులకు చేరిన నీటిమట్టం.. సీఎం కేసీఆర్ సమీక్ష..
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలతో అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ప్రవాహం ఎగిసిపడుతోంది. తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు, భద్రాచలం పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Godavari (5)
Godavari Flood: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలతో అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ప్రవాహం ఎగిసిపడుతోంది. తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు, భద్రాచలం పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఉదయం 8గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 67అడుగులకు చేరుకోగా.. మధ్యాహ్నం 12గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 69 అడుగులకు చేరింది. అధికారులు అంచనావేస్తున్నట్లుగా సాయంత్రం వరకు నీటిమట్టం 70అడుగులు దాటే అవకాశం కనిపిస్తుంది.
ఎగువ నుంచి గోదావరిలోకి 23.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలను ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
మరోవైపు భద్రాచలంలో కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్ పిస్తా కాంప్లెక్స్ ఏరియా, సుభాష్ నగర్ ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మందిని తొమ్మిది పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.
ముందు జాగ్రత్తగా గోదావరి వారధిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర ప్రాంతాలకు భద్రాచలం నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 144 సెక్షన్ విధించారు.
భద్రాచలం వద్ద వరద ఉధృతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. భద్రాచలానికి అదనపు రక్షణ సామాగ్రిని తరలించాలని సీఎస్ కు సూచించారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైక్ ద్వారా ప్రచారం చేశారు.