తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ DAలపై సర్కారు కీలక నిర్ణయం..
ఉద్యోగులకు సంబంధించిన 40కి పైగా సమస్యలను పరిష్కరించేందుకు సర్కారు సానుకూలంగా ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. పెండింగ్లో ఉన్న డీఏలలో రెండు చెల్లించడానికి తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అలాగే, ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే వారికి రావాల్సిన బెనిఫిట్స్లో కొంత మొత్తం చెల్లించడానికి కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీకి కొన్ని అంశాలను నివేదించాయి. దీనిపై ఇప్పటికే సర్కారు సానుకూలంగా స్పందించింది. ఇందులోని పలు ఆర్థిక పరమైన డిమాండ్లను కూడా ప్రభుత్వం నెరవేర్చనున్నట్లు సమాచారం.
ఉద్యోగుల సమస్యలపై సర్కారు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ.. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైంది. సర్కారుకి పలు సిఫార్సులతో కూడిన నివేదిక సిద్ధం చేసింది. ఉద్యోగ సంఘాలు నివేదించిన కొన్ని అంశాలను నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆ కమిటీ అధికారులు వివరాలు తెలిపారు.
Also Read: రూ.32,000లోపే ఖతర్నాక్ స్మార్ట్ఫోన్లు.. ఈ రెండు ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే..
దీంతో ఈ నెల 29న సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలతో పాటు, వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని అందులో చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన 40కి పైగా సమస్యలను పరిష్కరించేందుకు సర్కారు సానుకూలంగా ఉంది. ఆయా అంశాలు ఆర్థిక విషయాలకు ముడిపడి లేవు.
అలాగే, పలు ఆర్థిక సమస్యల పరిష్కారానికి సైతం సర్కారు పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం. అలాగే, సీపీఎస్ రద్దుతో పాటు ఓపీఎస్ పునరుద్ధరణపై మరింత అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మరో కమిటీని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల వేళ బదిలీ అయిన అధికారులను మళ్లీ ఆయా ప్రాంతాలకు పంపించే అవకాశం ఉంది.