గుడ్న్యూస్.. వారికి ప్రమాద బీమాను మరో నాలుగేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.10 లక్షల చొప్పున..
వాటిల్లో 204 కేసుల్లో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20.40 కోట్ల చెల్లింపులు జరిగాయి.

మహిళా సంఘాల సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారికి ఇచ్చే ప్రమాద బీమాను మరో నాలుగేళ్లు పొడిగిస్తూ జీవో జారీ చేసింది. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ప్రమాద బీమా పథకం 2029 వరకు పొడిగించినట్లయింది.
ఈ బీమాను స్త్రీ నిధి ద్వారా అమలు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదంలో మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే రూ.10 లక్షల బీమా ఇస్తున్నారు. దీని కింద ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 419. వాటిల్లో 204 కేసుల్లో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20.40 కోట్ల చెల్లింపులు జరిగాయి.
మిగతా కేసులకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. సర్కారు బీమా కూడా ఇస్తుండడంతో మహిళలు గ్రూపుల్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. 1.67 లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. 5,474 మంది లోన్ బీమా కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
వారిలో ఇప్పటివరకు 2,663 మందికి సెటిల్ చేశారు. మిగతా వారికి కూడా చెల్లింపులు చేసేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు సంఘాల సభ్యులుగా చేరుతుండడంతో మరింత ప్రోత్సహించేందుకు ప్రమాద బీమాను మరో నాలుగేళ్ల పాటు పొడిగించారు.