Burd flu: బర్డ్ ఫ్లూ టైమ్లో కూడా చికెన్ తినాలంటే ఇలా చేయండి..
కోళ్లు చనిపోతున్న వేళ అధికారులు పలు సూచనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ టైమ్లో కూడా చికెన్ తినాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో బతకలేదని వైద్య నిపుణులు అంటున్నారు. కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టాలని, ఇలా చేసి తింటే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. చికెన్ను 75 డిగ్రీల సెల్సియస్లో బాగా ఉడికించి తినాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
చికెన్ చెడు వాసన వస్తుంటే అది తినకుండా ఉండడం బెటర్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.
బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉండడంతో పలు సూచనలు చేసింది. గ్రిల్డ్ చికెన్తో పాటు సరిగ్గా ఉడకని చికెన్ను తినొద్దని చెప్పింది. కేంద్ర సర్కారు సైతం అన్ని రాష్ట్రా లను అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తెలంగాణ సర్కారు చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు కోళ్లను తీసుకురానివ్వద్దని నిర్ణయం తీసుకుంది.
కోళ్ల పెంపకం దారులతో పాటు చికెన్ వ్యాపారులకు, చికెన్ తినేవారికి హెచ్చరికలు చేసింది. కొన్ని రోజులు పాటు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తాము ముందస్తుగా జాగ్రత్తగా ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ చెప్పింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు సహా ఇతర పలు జిల్లాల్లో కోళ్లు భారీగా మృతి చెందడానికి హెచ్ఎస్ఎన్1-బర్డ్ ప్లూ వైరస్ కారణమని నిర్ధారణ అయింది.
30 రూపాయలకే చికెన్
ఉమ్మడి గోదావరి జిల్లాలో కిలో చికెన్ రూ.30కే అమ్ముతున్నప్పటికీ ఎవరూ కొనడం లేదు. బర్డ్ ప్లూ వైరస్ భయంతో వారు చికెన్కు దూరంగా ఉంటున్నారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో తాజాగా భారీగా కోళ్లు మృతి చెందాయి. ఆయా కోళ్ల శాంపిళ్లను సేకరించి పుణె ల్యాబ్కు పంపించారు. ఆ కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయినట్లు నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.