గులాబీ దళపతి వస్తున్నారు? సర్పంచ్ ఎన్నికలను కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారా?

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

గులాబీ దళపతి వస్తున్నారు? సర్పంచ్ ఎన్నికలను కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారా?

KCR

Updated On : November 26, 2025 / 9:41 PM IST

KCR: స్థానిక సమరం తెలంగాణ పొలిటికల్‌ పిచ్‌ను హీటెక్కిస్తోంది. గ్రామాల్లో పార్టీకి పునాదిగా ఉండే లోకల్‌ బాడీ పోల్స్‌పై రాజకీయ పార్టీలన్నీ సీరియస్ కాన్సన్‌ట్రేషన్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటుంది. బీసీ రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్‌ను ఎండగడుతూనే సర్పించ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్..మాట తప్పి పార్టీపరంగా రిజర్వేషన్లు అంటూ బీసీలకు అన్యాయం చేస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యింది గులాబీ పార్టీ. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా ఇతర హామీల వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. (KCR)

పార్టీ పరంగా పంచాయతీ ఎలక్షన్స్ ప్లాన్స్‌ అలా ఉంటే..గులాబీ బాస్‌ కేసీఆర్..సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచ్‌లు రోల్‌ కీలకంగా మారనున్న నేపథ్యలో..సాధ్యమైనంత వరకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించుకోవాలని భావిస్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్వయంగా అధినేత కేసీఆర్ రంగంరోకి దిగబోతున్నారని తెలుస్తోంది.

Also Read: నల్లగొండ డీసీసీ పీఠంపై రచ్చ రచ్చ.. కోమటిరెడ్డి బ్రదర్స్ తలోమాట.. ఎందుకంటే?

అనారోగ్యంతో పాటు వివిధ కారణాలతో గత రెండేళ్లుగా కేసీఆర్ ఎర్రవెళ్లి ఫామ్‌హౌజ్‌లోనే గడుపుతున్నారు. ఒకట్రెండు సార్లు తెలంగాణ భవన్‌కు, చికిత్స కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు కొన్ని రోజులు నందినగర్ నివాసంలో ఉన్నారు కేసీఆర్. పార్టీకి సంబంధించి ముఖ్య సమావేశాలు నిర్వహించాల్సి వచ్చినా, నేతలను కలవాల్సి వచ్చినా ఫామ్ హౌజ్‌కే పిలిపించుకుంటున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నేతలంతా కేసీఆర్‌ను కలవాలంటే ఎర్రవల్లికి వెళ్తున్నారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి హైదరాబాద్‌కు..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి రానున్నారని అంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసే వరకు నందినగర్ నివాసంలోనే ఉంటూ..తెలంగాణ భవన్‌కు వచ్చి వెళ్తారని సమాచారం.

జిల్లాల నుంచి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చే వారికి ప్రత్యేకంగా సమయం కేటాయించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ తగిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అధినేత కేసీఆర్ జస్ట్ అలా తెలంగాణ భవన్‌లో ఉంటే పార్టీ నేతలకు, క్యాడర్‌కు బూస్ట్‌ను ఇస్తుందనే చర్చ జరుగుతోంది.

అది కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, పార్టీ బలపరిచిన సర్పంచుల గెలుపుకు ఉపయోగపడుతుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. 2001లో పార్టీ పెట్టాక వచ్చిన మొదటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా బలపడ్డారో..అలా ఇప్పుడు గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ బలోపేతం కోసం సర్పంచ్‌ ఎన్నికలకు అస్త్రంగా వాడుకునే ప్లాన్ చేస్తున్నారట. మరి నిజంగానే కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తారా..కేసీఆర్‌ తెరమీదకు వస్తే సర్పంచ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి మరి.