ఆయన మరణమే మాగంటిని కలిచివేసిందా..?
ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని..పదుల సార్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారట మాగంటి గోపినాథ్.

Maganti Gopinath
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చావుబతుకుల్లోకి వెళ్లేందుకు కారణమేంటి.? ఆల్ ఆఫ్ సడెన్గా ఆయన ఎందుకు ఆస్పత్రి పాలయ్యారు.? నియోజకవర్గంలోని రాజకీయ వివాదాలే మాగంటి అరోగ్యాన్ని దెబ్బతీశాయా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు, మాగంటి కుటుంబ సభ్యులు. మాగంటి గోపీనాథ్ గుండెపోటుకు గురికావడానికి పరోక్షంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీ కారణం అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.
దీంతో అసలు మాగంటి, బాబా మధ్య వివాదం ఏంటన్నదానిపై ఇప్పుడందరూ ఆరా తీస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బాబా ఫసియుద్దీన్కు, మాగంటికి గొడవ ఎక్కడ మొదలైందన్న దానిపై చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితం బోరబండలో ఓ దారుణం జరిగింది. బీఆర్ఎస్కు చెందిన మైనార్టీ లీడర్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారు.
బాబా ఫసియుద్దీన్ వేధింపులు తట్టుకోలేకే?
ఆయన బలవన్మరణానికి కారణం బాబా ఫసియుద్దీనే అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. బాబా ఫసియుద్దీన్ వేధింపులు తట్టుకోలేకే సర్దార్ ఆత్మహత్యకి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబాపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు పోలీసులు. సర్దార్ ఇంటిని కూల్చేందుకు ఫసియుద్దీన్ ప్రయత్నించాడని అందుకే మనస్థాపానికి గురై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
సర్దార్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు.
నిత్యం ఆయన వెంటే ఉండే సర్ధార్..మాగంటి కుటుంబంలో ఓ సభ్యుడైపోయారు. అలాంటి సర్ధార్ మరణం మాగంటిని కుంగదీసిందని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. సర్ధార్ బలవన్మరణంతో మాగంటి తీవ్ర మనోవేదనకు గురయ్యారట. సర్ధార్ను తలుచుకుంటూ నాలుగైదు రోజులుగా మాగంటి తీవ్ర ఆవేదన చెందారని.. సర్దార్ చనిపోయిన రోజంతా ఆయన ఇంటివద్దే ఉన్నారని చెబుతున్నారు కుటుంబసభ్యులు.
ఎప్పుడూ తన వెంటే ఉండే అత్యంత సన్నిహితుడైన సర్ధార్ ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక.. క్రుంగిపోయారట మాగంటి. కనీసం భోజనం కూడా చేయకుండా నిద్ర కూడా పోకుండా ఎప్పుడూ సర్దార్నే తలుచుకుంటూ బాధపడ్డారని అంటున్నారు.
మాగంటి గోపినాథ్కు ఫసియుద్దీన్కు బిఆర్ ఎస్ లో ఉన్నప్పటినుండే విబేదాలుండేవి… కాంగ్రెస్ లో చేరిన తర్వాత మాగంటి ప్రధాన అనుచరుడైన సర్ధార్ను ఫసియుద్దీన్ టార్గెట్ చేసినట్లు బీఆర్ఎస్ చెబుతోంది.
మాగంటిని మానసికంగా దెబ్బతీసేందుకు ఫసియుద్దీన్ సర్ధార్ను వేధించాడని…ఆ వేధింపులు తట్టుకోలేకే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు పలువురు నేతలు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని..పదుల సార్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారట మాగంటి గోపినాథ్. ఇప్పుడైనా పోలీసులు స్పందించి యాక్షన్ తీసుకోకపోతే తమ ప్రభుత్వం వచ్చాక రియాక్షన్ మరింత సాలిడ్గా ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు బిఆర్ ఎస్ నేతలు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళ్తుందో..