రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవు: మందకృష్ణ మాదిగ

చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఇవ్వలేదు.

Manda Krishna Madiga: కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాలలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్ముకు అయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గుణపాఠం తప్పదని అన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

”కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి కూతురికి వరంగల్ ఎంపీ కేటాయించింది. మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాలు ఉంటే.. మూడు స్ధానాలను మాదిగలకు కేటాయించ లేదు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయమే చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాదిగలను జనాభా లెక్కల నుంచి తీసేసింది. కాంగ్రెస్ పార్టీలో మాలలకు తప్ప మాదిగలకు సముచిత స్థానం లేదు. స్దానికుడు కాక పోయినా నాగర్ కర్నూల్ టికెట్ మల్లు రవికి కేటాయించింది. వరంగల్ ఎస్సీ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు. సొంత పార్టీ నాయకులు వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించి భంగం పడ్డారు. ఊరికి ఒక్కరు లేని బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయించారు. తెలంగాణలో నూటికి 70 శాతం ఉన్న మాదిగలకు గుర్తించడం లేదు.

Also Read: దండోరా ముసుగు తీసేయ్.. మందకృష్ణ మాదిగకు కడియం శ్రీహరి సలహా

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతాం. మేము ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తాం. మాదిగలే తన గెలుపునకు దోహద పడ్డారన్న రేవంత్ రెడ్డి ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్ ఇవ్వ లేదు? రెడ్డి సామాజికవర్గానికి తప్ప.. ఎవరికీ న్యాయం చేయలేదు. చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున మెజార్టీ అభ్యర్థులు రెడ్డిలకే కేటాయించారు.12 స్థానాల్లో మెజార్టీ స్థానాలు రెడ్డిలే ఉన్నారు. మాదిగలతో పాటు బీసీలకి కూడా రేవంత్ రెడ్డి అన్యాయం చేశార”ని మందకృష్ణ మాదిగ విమర్శించారు.

కడియం శ్రీహరి.. కుట్రదారుడు
మాదిగల ఉద్యమానికి ద్రోహం చేసిన కడియం శ్రీహరి.. కుట్రదారుడు, విల్లువల్లేని వ్యక్తి అంటూ దుయ్యబట్టారు. తమ ఉద్యమానికి సహకారించింది గోరంత, ద్రోహం కొండంత అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీ సీటు లాక్కున్నది చాలక.. కాంగ్రెస్ పార్టీలోనూ మాదిగ సీటు గుంజుకున్నారని ఆరోపించారు. మాదిగలతో ఉప కులాల వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే గతంలో కడియం శ్రీహరికి తాను మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదగడానికి తమను వాడుకున్నారని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు