మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించాక మంత్రులు సంచలన కామెంట్స్
దీన్ని తాము సీరియస్గా తీసుకున్నామని, దీనిపై వాస్తవాలు తెలుసుకునేందుకు పూర్తి సమాచారం..

Medigadda Barrage
Medigadda Barrage: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కట్టడాలు ఎలా జరిగాయి? అవి ఎందుకు పాడైపోయాయి? తెలంగాణ సంపదను సరైన విధానంలో ఖర్చు చేశారా? లేదా? అనే విషయాలపై సమీక్ష చేయడానికి వచ్చామని చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయడానికే వచ్చామని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపు సమస్యపై చర్చ జరిగిందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి మూడు బ్యారేజ్లు కట్టారని చెప్పారు. రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందే ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం కట్టారని అన్నారు. భారీ వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. దీన్ని తాము సీరియస్గా తీసుకున్నామని చెప్పారు.
దీనిపై వాస్తవాలు తెలుసుకునేందుకు పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని తనిఖీ చేయడానికి వచ్చామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని చెప్పారు. ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్ట్ డ్యామేజ్ కావడం బాధాకరమని అన్నారు.