హైదరాబాద్లో దారుణం.. బెట్టింగ్ డబ్బుల విషయంలో తండ్రి ప్రశ్నించాడని.. సర్ప్రైజ్ చేస్తానంటూ.. కళ్లకు గంతలు కట్టి.. గొంతులో కత్తితో..
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టిన డబ్బులు గురించి తండ్రి ప్రశ్నించడంతో..

Online betting
Hyderabad: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టిన డబ్బులు గురించి తండ్రి ప్రశ్నించడంతో.. సర్ప్రైజ్ చేస్తానని చెప్పి తండ్రి కళ్లకు గంతలు కట్టిన కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. ఆ తరువాత తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియలకోసం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే హత్యచేశానని కొడుకు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి అతన్ని రిమాండ్ కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంటకు చెందిన కేతావత్ హన్మంత్ (37) బతుకుదెరువు కోసం గోపన్పల్లి ఎన్టీఆర్ నగర్ కు వలస వచ్చి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య జములమ్మ, కొడుకులు రవీందర్, సంతోష్ లు ఉన్నారు. హన్మంత్ ఇటీవల తన భూమిని అమ్మి రూ.6లక్షల అప్పులు తీసుకొని ఇంట్లో పెట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కేతావత్ రవీందర్ ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి రెండున్నర లక్షలు తీసుకెళ్లి ఆన్ లైన్ బెట్టింగ్ లో పోగొట్టాడు.
ఇంట్లో డబ్బులు కనిపించక పోవటంతో రవీందర్ ను తండ్రి హన్మంత్ ప్రశ్నించాడు. అవసరానికి స్నేహితుడికి ఇచ్చానని, కొద్దిరోజుల్లో మొత్తం డబ్బు చెల్లిస్తానని చెప్పాడు. కొద్దిరోజులుగా ఇంట్లో డబ్బుల విషయంపై ఘర్షణ జరుగుతుంది. దీంతో రవీందర్ తండ్రి హన్మంత్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడని మంగళవారం తండ్రిని ఎన్టీఆర్ నగర్ లోని జనసంచారం లేని ప్రాంతానికి తెసుకె్లాడు. నీకు సర్ప్రైజ్ ఇస్తానని తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతులో బలంగా పొడిచాడు. కొడుకు నుంచి తప్పించుకునేందుకు హన్మంత్ కొద్దిదూరం పరుగెత్తి ఆ తరువాత కిందపడి చనిపోయాడు.
తండ్రిని హత్య చేసిన తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రవీందర్ కొత్త నాటకం ఆడాడు. తన బాబాయ్ రమేశ్ కు ఫోన్ చేసి నాన్న కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేప్పాడు. కుటుంబ సభ్యులను, బంధువులను అందరిని అదేతీరిలో నమ్మించాడు. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కోతులకుంటకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘనపూర్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు రవీందర్ పై అనుమానంతో అతన్ని విచారించగా.. తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.